మీరు కష్టపడితే నేనే సీఎం!: శ్రీకాకుళం పర్యటనలో పవన్ కీలకవ్యాఖ్యలు, ఇంకా రాని బస్సు అందుకే కారులో
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దల ఆశీస్సులతో, యువత మద్దతుతో, అక్కాచెల్లెళ్ల తోడుతో 2019కి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కోసమే జనసేన పోరాట యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పవన్ ఆదివారం శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాట యాత్ర ప్రారంభించారు.
శనివారం రాత్రి ఇచ్ఛాపురంలో బస చేసిన ఆయన ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేశారు. అక్కడి నుంచి పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రగా వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది.
సముద్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్, నేడే పోరాట యాత్ర ప్రారంభం
వలసలను నివారించే బాధ్యత నాదే
పోరాట యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పోరు యాత్ర అన్నారు. మిగతా రాజకీయ పార్టీలకు జనసేనకు చాలా తేడా ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. శ్రీకాకుళం వలసలను నివారించే బాధ్యతను నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు.
కార్యకర్తలు కష్టపడితే ముఖ్యమంత్రిని అవుతా
ప్రజల మద్దతుతో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. కార్యకర్తలు కష్టపడితే తాను ముఖ్యమంత్రిని అవుతానని తెలిపారు. అందరి మద్దతు ఉంటే తాను కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ మిగతా పార్టీల వారిగా కులాలను విడదీయదని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను ఎప్పుడు కూడా పదవులను కోరుకోలేదని చెప్పారు. పని చేయడానికే నేను ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని తెలిపారు.
రాత్రి బస అక్కడే
కాగా, జనసేన అధినేత చివరి క్షణంలో బస్సు యాత్రకు బదులు సొంత కారులో యాత్ర చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రారంభం కాబట్టి ఆయన కారులో వెళ్తున్నారు. పవన్ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేస్తున్నారు. కానీ అది శ్రీకాకుళం జిల్లా చేరేసరికి మరికొంత సమయం పడుతుంది. అందుకే ఆయన ప్రస్తుతానికి కారులో యాత్ర చేస్తున్నారు.
పవన్ యాత్ర మధ్యలో నాయకులు, కార్యకర్తల చేరిక
పవన్ యాత్ర మధ్యలో పార్టీలోకి నాయకుల చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఎక్కడికి అక్కడ పార్టీలోకి సాధారణ కార్యకర్తలను, నాయకులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు. యాత్ర సందర్భంగా పవన్ కమ్యూనిటీ హాళ్లు లేదా కళ్యాణ మండపాలలోనే రాత్రి బస చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో గంగ స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని కపాసుకుద్ది తీర ప్రాంతంలో గంగపూజ చేశారు. ఈ సందర్భంగా ఓ సోదరి జనసేన అధినేతపై బిందెతో నీళ్లు పోస్తున్న దృశ్యం. అభిమానులు, కార్యకర్తలు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఆయన మాత్రం తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమని చెబుతున్నారు.