చంద్రబాబు ఆఫీస్లో నా అభిమానులు, మరి నేను రోడ్డుపై అడుక్కు తినాలా: పవన్ కళ్యాణ్
అమలాపురం: తాను ప్రతి నియోజకవర్గానికి వందమంది నాయకులను తయారు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన అమలాపురంలో విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ధైర్యంతో చేయాలి, త్యాగం చూపాలి.. అలాంటి వాళ్లే గొప్ప నాయకులు అవుతారని చెప్పారు.
కార్పోరేట్ స్కూల్స్, కాలేజీలు ఉద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలకే పరిమితం అయితే జ్ఞానం ఎలా వస్తుందని ప్రశ్నించారు. కులరహిత సంక్షేమ హాస్టళ్లు, కామన్ స్కూల్ విధానం రావాలని చెప్పారు. ఓటును కాపాడుకుంటేనే అవినీతిని తరిమేయగలమని అన్నారు.
రూ.45 కోట్లతో హైదరాబాద్లో పవన్ కొత్తిల్లు, చిరంజీవి మాత్రమే వెళ్లారు, అమరావతిలో రూ.కోట్ల భూమి'
చంద్రబాబు కార్యాలయంలో నా అభిమానులు
ఏపీలో జన సైనికుల ఓట్లు తీసేస్తున్నారని, వారు ఓటును తీసేయగలరేమో కానీ ప్రాణాలు మాత్రం తీయలేరుగా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి చేసే నాయకులకు యువత అంటే భయమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయంలోను తన అభిమానులు ఉన్నారని జనసేనాని చెప్పారు. యువత తన వెంటే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాంటి నాయకులను తయారు చేసేందుకు 25 ఏళ్లు
యువత మీ ఓటును మీరు కాపాడుకుంటే టీడీపీ, వైసీపీని పక్కన పెట్టేయవచ్చునని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారానికి ఓసారి మీ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. తాను అధికారం కోసం రాలేదని, అందుకే ఓటమి భయం లేదని చెప్పారు. 25 ఏళ్ల పాటు పోరాటం చేసేందుకు సిద్ధమని చెప్పారు. భారతదేశంలోనే అత్యంత ప్రభావశీల నాయకులు ఏపీ నుంచి రావాలనేది నా కోరిక అన్నారు. నేను అనుకున్నటు వంటి నాయకులను తయారు చేసేందుకు 25 ఏళ్లు పడుతుందన్నారు.
సిద్ధూ.. సిక్స్ కొట్టినప్పుడు చప్పట్లు కొట్టిందెవరు.. పవన్ ఆగ్రహం
చంద్రబాబు నాయకుడు కాదని, ఓ ముఖ్యమంత్రి, రాజకీయవేత్త మాత్రమేనని పవన్ అన్నారు. నేను తుది శ్వాస విడిచే వరకు ప్రతి నియోజకవర్గంలో వందమంది బలమైన నాయకులను తయారు చేస్తానని చెప్పారు. తాను ఊహించుకున్నటు వంటి నాయకులను చేస్తానన్నారు. అయితే అందుకు విలువలు పాటించాలని, నిస్వార్థంగా పని చేయాలన్నారు. వివక్ష లేదని చెప్పే నేతలవి మాటలు మాత్రమే అన్నారు. నైజీరియా వారిపై ఢిల్లీలో దాడి జరిగితే ఖండించాల్సిన బీజేపీ ఎంపీ నల్లగా ఉన్న వారు అంటూ దక్షిణాదిని అవమానిస్తారని, పాకిస్తాన్ను మెచ్చుకోవడానికి క్రికెటర్ సిద్ధూ దక్షిణ భారతదేశాన్ని తగ్గించి మాట్లాడారని పవన్ మండిపడ్డారు. ఆయన సిక్సులు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టింది పంజాబీలు, పాకిస్తానీలు కాదని, దక్షిణ భారతీయులు అన్నారు. ఇలాంటివి దేశ విభజనకు దారి తీస్తాయన్నారు. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా వివక్ష మానుకోవాలని చెబుతున్నానని అన్నారు.
పవన్ కళ్యాణ్ రోడ్డుపై అడుక్కు తినాలా
తనకు పేపర్, ఛానల్ లేదని, తన మీద వార్తలు రాసేవారు కూడా కొందరు తనను అడగకుండా రాస్తున్నారని పవన్ చెప్పారు. తాను సినిమాలు వదిలేశానని అన్నారు. సినిమా ప్రొడక్షన్ పెట్టడానికి తనకంటూ ఓ వ్యాపారం ఉండేందుకేనని చెప్పారు. తాను సినిమాల్లో చేసినప్పటి నుంచే పెద్దగా కవరేజ్ ఇచ్చేవారు కాదని చెప్పారు. భవిష్యత్తులో ఇబ్బందిపెడతాననే భయంతో అలా చేసి ఉంటారని అన్నారు. తనపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడానికి గందరగోళం సృష్టించేందుకే అన్నారు. చంద్రబాబు హెరిటేజ్ పెట్టవచ్చు, జగన్ భారతీ సిమెంట్ పెట్టవచ్చు, పవన్ మాత్రం రోడ్డు మీద అడుక్కు తినాలా అన్నారు. తనకు పేపర్లు అవసరం లేదని, మీరే నా మీడియా అని, తన అభిమానులు చంద్రబాబు కార్యాలయంలోను ఉన్నారని చెప్పారు.
నారాయణ, చైతన్యలు విద్యార్థులను ఎదగనీయట్లేదు
ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలను పుస్తకాలకు పరిమితం చేస్తున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల్ని గదుల్లో బంధించి చదువు చదువాలంటూ హింస్తున్నాయని, బట్టి చదువులకు స్వస్తి చెప్పాలన్నారు. విద్యార్థి దశలో క్రీడలతో పాటూ మిగిలిన యాక్టివిటీస్ కూడా ఉండాలన్నారు. బలమైన శరీరం లేనప్పుడు బలమైన ఆలోచనలు ఎలా వస్తాయన్నారు. 24 గంటలు గదుల్లో కుక్కి పుస్తకాల పురుగులను చెయ్యడంతో వారి మెదడు మొద్దు బారిపోతుందని హెచ్చరించారు. పవన్ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. నెల్లూరులో తాను చదువుకునేటప్పుడు ఎకనామిక్స్ పేపర్ రాయడానికి విక్రమ్ గైడ్ స్లిప్లు పట్టుకెళ్లానని, మనసు అంగీకరించక కాపీ కొట్టలేదన్నారు. నారాయణ, శ్రీచైతన్య లాంటి కాలేజీలు విద్యార్థులను జీవితంలో ఎదగనీయడం లేదన్నారు.