ఏపీలో మారుతున్న సమీకరణాలు, బాబును గెలవనీయను, జగన్ గెలిచే ప్రసక్తి లేదు: పవన్ కళ్యాణ్
ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంలో బసచేసిన జనసేనాని ఉదయం గుర్వాయగూడంలోని మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ఆంజనేయస్వామి తనకు ఎంతో ఇష్టమైన దేవుడు అని, తమ కుటుంబానికి ఇలవేల్పు అని పవన్ చెప్పారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. అంజనేయుడికి పూజ చేసిన అనంతరం తన పర్యటనకు వెళ్లారు.
'రహస్య పూజలపై' జనసేన దమ్మతిరిగే కౌంటర్! ఆ లోపు వెళ్లిపోవాలని పవన్కు పోలీస్ ఆదేశాలు
డ్వాక్రా టీడీపీ తీసుకు వచ్చిన పథకం కాదు
పవన్ కళ్యాణ్ డ్వాక్రా మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను జనసేనానికి విన్నవించుకున్నారు. డ్వాక్రా పథకం అనేది టీడీపీ తీసుకు వచ్చిన పథకం కాదని, అది అంతర్జాతీయ పథకమని చెప్పారు. దీనినే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసిందని ఆయన అన్నారు. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తూ డ్వాక్రా మహిళలను అమాయకులుగా చేసి దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఉచితంగా ఏమీ డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. ఇది డ్వాక్రా మహిళల శ్రమ అని, ఉమ్మడిగా మీరు ఇచ్చిన డబ్బును మీకు రుణాల రూపంలో ఇస్తున్నారని చెప్పారు. వారి జేబులో నుంచి ఇవ్వడం లేదని చెప్పారు.
అలా చేస్తే చంద్రబాబు ఓడిపోయేవారు కాదు
చంద్రబాబు ఎఫ్పుడు గెలిచినా డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని చెబుతారని, రుణమాఫీ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తారని, అలాంటివి ఆపాలని పవన్ సూచించారు. డ్వాక్రా మహిళలు కూడా ఆ మాయ మాటలు వినవద్దని హితవు పలికారు. డ్వాక్రా మహిళలకు నిజంగానే అండగా ఉండి ఉంటే చంద్రబాబు 2004, 2009లో ఓడిపోయి ఉండే వారు కాదన్నారు. అలాగే 2014లో తమ మద్దతుతో గెలిచే అవకాశం వచ్చేది కాదన్నారు.
2019లో చంద్రబాబును గెలవనీయను
2019లో చంద్రబాబు గెలిచే ప్రసక్తి లేదని, ఆయనను గెలవనీయనని, 2019లో టీడీపీ ఎవరి సపోర్ట్ లేకుండా గెలవలేదని, మీరు దోచుకుంటూ ఉంటే చూస్తూ కుర్చోమని పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్లీ గెలిపిస్తే డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు అంటూ చంద్రబాబు చెబుతున్నారని, ఇలాంటి అసత్యపు హామీలు మానుకోవాలన్నారు.
మారుతున్న సమీకరణాలు, జగన్ కూడా గెలవరు
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అన్నారు. కొత్త రాజకీయ మార్పు రాబోతుందని జోస్యం చెప్పారు. అందరు కూడా ఆ మార్పును స్వాగతించాలని సూచించారు. మనకు ప్రభుత్వం ఉత్తినే ఏమీ ఇవ్వడం లేదని, అది మన హక్కు అని జనసేనాని అన్నారు.