వెంకయ్య మాటేంటి, హఠాత్తుగా కాదు, జగన్ను అనొద్దన్నారు: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్
అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయనని, ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2014లో వైసీపీ అధినేత జగన్ పైన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఏపీకి తక్షణమే హోదా ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.
చదవండి: ఇష్యూ చేస్తారా,అంతా వాళ్లే, ఇప్పటికీ రాలేదు: ఏపీకి సాయంపై జైట్లీ బాంబు, బాబుకు షాక్
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాది ఆధిపత్యం వల్లే తెలుగు రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. అప్పట్లో మోడీని గాంధీ నగర్లో కలిసినప్పుడే దక్షిణాది వేరయ్యే ఆలోచనలు ఏర్పడ్డాయని చెప్పానని తెలిపారు.
చదవండి: 'ఊసరవెళ్లి..ఇదిగో ఇలానా' 'ఒత్తిడిలో చంద్రబాబు', పవన్పై విమర్శలకు ప్రశ్నల వర్షం!
ఉత్తరాది, దక్షిణాదిపై ఇప్పుడు బాబు, సిద్ధరామయ్యలు
దక్షిణాది వారి పట్ల ఉత్తరాది వారు వివక్ష చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య అంతరం గురించి నేను మాట్లాడితే చాలామంది విభేదించారని, ఇప్పుడు చంద్రబాబు, సిద్ధరామయ్యలు కూడా మాట్లాడారన్నారు. ఉత్తరాది పెత్తనం ఎందుకన్నారు.
వెంకయ్య నాయుడును ఎందుకు నిలదీయట్లేదు
ప్రత్యేక హోదా అవసరాన్ని ఎన్నికల సమయంలోనే గుర్తించానని పవన్ చెప్పారు. హోదా విషయంలో నాలుగేళ్లుగా మాట్లాడుతోంది, ప్రధాని మోడీని నేరుగా విమర్శిస్తోంది తానేనని, అలాంటప్పుడు తన వెనుక బీజేపీ ఎందుకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు టీడీపీ, వైసీపీలు మోడీని విమర్శించలేదని ఆభిప్రాయపడ్డారు. గుంటూరు సభలో జైట్లీని ఉద్దేశించి ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల సరిగా వారు అర్థం చేసుకోలేకపోయారేమేనన్నారు. మోడీ గురించి తాను ఎప్పుడు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ఈ విషయంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు. అసలు వెంకయ్య నాయుడిని ఎవరూ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. హోదా విషయంలో తమకు మద్దతు ఉందని, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాలు పోరాడుతున్నాయని చెప్పారు.
హఠాత్తుగా యూటర్న్ తీసుకోలేదు
టీడీపీ ప్రభుత్వ విధానాలు, రాజధాని భూముల విషయమై తాను హఠాత్తుగా యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబుకు పవన్ కౌంటర్ ఇచ్చారు. హఠాత్తుగా ఇప్పుడు తమ అవినీతి కనిపించిందా అని బాబు ప్రశ్నించారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ఎప్పటి నుంచో సీఎంకు తన అభిప్రాయాలు చెబుతున్నానని, ఆయనపై తనకు గౌరవం ఉందని, సమస్య పరిష్కారం కావాలనే తాను భావిస్తానని, రాజకీయం చేయాలని అనుకోనని, అవసరమైనప్పుడే మాట్లాడుతానని చెప్పారు. తూటాకు తూటాలా, మాటకు మాటలా సమాధానం చెప్పాలని అనుకోనని, తన రాజకీయ పద్ధతులు వేరని చెప్పారు. ఫాతిమా విద్యార్థుల సమస్య కేంద్రానిదేనని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించి ఉంటే బాగుండేదన్నారు.
రాజధాని నిర్మాణంపై
రాజధాని అమరావతి నిర్మాణం కోసం సమీకరించిన 33000 ఎకరాల్లో నాలుగో వంతు మాత్రమే వినియోగిస్తారని తాను కూడా అంగీకరిస్తానని గానీ గతంలో చంద్రబాబుతో మాట్లాడినప్పుడు 1400 ఎకరాలు చాలని చెప్పారని, కానీ సేకరించింది ఎంతో ఎక్కువగా ఉందన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నేను చేసిన ప్రతి మాటను చంద్రబాబుకు వ్యక్తిగతంగా చెప్పానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, ఒక ప్రాంతం, సంస్కృతి సంప్రదాయాలని మరో ప్రాంతం గౌరవించకుంటే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని, తెలంగాణ విషయంలో అదే జరిగిందన్నారు. ఇప్పుడు కళింగాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాంతీయవాదం పెరిగే ప్రమాదముందన్నారు.
రాజధాని కోసం ఎంత ప్లాన్ అయినా సరే
రాజధాని నిర్మాణం కోసం ఎంత ప్లాన్ అయినా ఉండవచ్చునని, కానీ మొదట కొంత భూభాగాన్ని తీసుకొని అభివృద్ధి చేసి రాజధాని ఇలా ఉంటుందని చూపిస్తే అభివృద్ధి మరింత త్వరగా అవుతుందని పవన్ కళ్యాఅన్నారు. రాజధాని అంటే అందరినీ కూడగట్టేలా ఉండాలని, కొందరిని విడిచిపెట్టేలా ఉండవద్దన్నారు. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయామని, అసమానతలు వద్దన్నారు. ముంబై సహా ఏ నగరానికి వెళ్లినా అక్కడ ఎవరూ ఏమిటి అనే విభేదాలు కనిపించవన్నారు.
జగన్ను విమర్శించవద్దన్నారు
2014 ఎన్నికల సమయంలో వైసీపీని విమర్శించవద్దని చెబుతూ తమకు జగన్ అంటే అభిమానమని, మీరు ఇష్టమని విశాఖలో కొందరు చెప్పారని, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవని, పార్టీపరమైన నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారు. వారు వద్దని చెప్పినా వినలేదని, జగన్ పైన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అవిశ్వాసంపై టీడీపీ, వైసీపీలు డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.