వాళ్లే ఇటు వస్తుంటే...చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటు వెళ్లడం బాధ కలిగించింది:పవన్ కళ్యాణ్
అమరావతి:యూపీ, బీహార్ ఎంపీలు ఆంధ్ర ఎంపీలను కొట్టి తరిమేశారు. కాంగ్రెస్లో దశాబ్దాలుగా ఉన్న నాయకులే మిగిలిన పార్టీల వైపు వస్తుంటే..చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటు వైపు వెళ్లడం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ తో టిడిపి పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దైవం తలిస్తే తాను పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చని...అలాగే సిఎం కూడా కావచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. నీకేం కావాలని సిఎం చంద్రబాబు నన్ను అడిగితే తనకేం కావాలో ఆయనకు చెప్పేవాడినని, అయితే చంద్రబాబు తాను కోరింది తప్ప అన్నీ చేశారని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దేవుడు తలిస్తే...సిఎంని అవుతా
ప్రస్తుతం తూర్పుగోదావని జిల్లాలో ప్రజా పోరాట యాత్ర నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ..."అందరూ నన్ను పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారు...తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నుంచీ పోటీ చేయమంటున్నారు... అన్ని నియోజకవర్గాలూ నావే...అయినా నిర్ణయం నాది కాదు...సెలక్షన్ కమిటీ నిర్ణయించాలి...శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు ఇచ్చి ఇక్కడి నుంచి పోటీచేయమంటే సరే...మీ అరుపులే మంత్రాలై...ఆ దేవుడు నన్ను ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు"...అని భావోద్వేగంతో మాట్లాడారు.
అంబేద్కర్ లా...జ్వలించండి
పవన్ ప్రసంగిస్తుండగా అభిమానులు సీఎం...సీఎం...అని ప్రసంగం మధ్యలో పదే పదే పెద్దఎత్తున నినాదాలు చేస్తుండటంతో అభిమానుల నినాదాలపై పవన్ స్పందిస్తూ..."ఈరోజు అరుస్తాం...వెళ్లిపోతాం...ఆలోచన దహిస్తుంది...అంబేడ్కర్లా జ్వలిస్తేనే మార్పులొస్తాయి"...అని హితవు పలికారు. అంబేడ్కర్ దేశంలోని దళితులంతా ఒక్కటి కావాలని కోరుకుంటే...తెలంగాణ వాదం దళితులను విడదీసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇక సిఎం చంద్రబాబుకు హెరిటేజ్ బిజినెస్, విపక్ష నేత జగన్ కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ను వరంగల్లో కొట్టి తరిమేశారని పవన్ చెప్పారు. అసలు తెలంగాణా వీరిద్దరినీ రానివ్వరన్నారు.
మోడీతో...లోకేష్ కే బంధుత్వం
అయితే జనసేన నేతలు కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పవన్ విశ్లేషించారు. మోడీకి తాను దత్తపుత్రుడని ఎద్దేవా చేస్తున్న మంత్రి లోకేష్ వ్యాఖ్యలను పవన్ తిప్పికొట్టారు."లోకేష్ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు...వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి...తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు...భయం అంతకంటే లేదు"...పవన్ తేల్చేశారు.
అందరూ ఇటు...చంద్రబాబు అటు
తాను ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తినని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకులాగా నేను రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా యూపీ, బిహార్ ఎంపీలు ఆంధ్ర ఎంపీలను కొట్టి పంపేశారు...కాంగ్రెస్లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న నాయకులు సైతం మిగిలిన పార్టీలవైపు వస్తుంటే... చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు.
అది తప్ప...అన్నీ చేశారు
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంలో నీకు ఏమి కావాలని చంద్రబాబు తనను కలిసినప్పుడల్లా అడిగేవారని...అందుకు జవాబుగా తాను రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండాలి...మీ ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి...అని కోరేవాడినని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తాను కోరింది తప్ప అన్నీ చేశారని పవన్ దుయ్యబట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే పేకాట క్లబ్బు నడుపుతున్నారని...మహిళా ఉద్యోగులను అవమానిస్తున్నారని పవన్ ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నం గురించి మాట్లాడుతూ కోడి కత్తి యుద్ధంలోకి దిగితే రాజకీయాలే మారిపోయాయన్నారు. అయితే జగన్పై దాడి బాధ కలిగించిందని...అయితే దోషులెవరో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు.