తెలంగాణ పరిస్థితి తెచ్చుకోవద్దు, కరెంట్ తీసి నాపై దాడి ప్రయత్నమా, బట్టలూడదీసి కొడతా: ఊగిపోయిన పవన్
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. విభజన నుంచి ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటిని విస్మరించారని ధ్వజమెత్తారు. అంతేకాదు, తనపై కొందరు కిరాయి రౌడీలు రాత్రిపూట దాడికి ప్రయత్నించారని, అలాంటి వాటిపై ఊరుకునే సమస్యే లేదని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ అనే మేధావి రాష్ట్రాన్ని ముంచారు, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: జగన్
ప్రత్యేక హోదా విషయంలో జనసేన మొదటి నుంచి ఓకే వైఖరితో ఉందని చెప్పారు. ఆ రోజు తమతో కలిసి చంద్రబాబు గొంతు కలిపి ఉంటే హోదా వచ్చి ఉండేదన్నారు. ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులనే ఏపీలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ పునరావృతం చేస్తున్నాయని మండిపడ్డారు.
శ్రీకాకుళం దాటేలోపు కీలక నిర్ణయం తీసుకుంటా, 48 గంటల సమయం ఇస్తున్నా: బాబుకు పవన్ అల్టిమేటం
టీడీపీకి ఓటు వేయమని చెప్పా, అందుకే ప్రశ్నిస్తున్నా
2014లో తాను బీజేపీ - టీడీపీలకు మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అనుభవజ్జుడు, కొత్త రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు అండగా నిలబడ్డానని చెప్పారు. కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. 2014లో తాను టీడీపీకి ఓటు వేయమని ప్రజలకు చెప్పానని, కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతో ప్రశ్నించడానికి వచ్చానని జనసేనాని చెప్పారు.
అన్ని స్థానాల్లో జనసేన పోటీ
ప్రత్యేక హోదాకు కేంద్రం, రాష్ట్రం తూట్లు పొడిచిందని పవన్ మండిపడ్డారు. 2019లో సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరమన్నారు. జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. సామాజిక రాజకీయ మార్పు కావాలని చెప్పారు. ప్రజలను తాము మోసం చేయమని చెప్పారు.
తెలంగాణలో కొట్టుకుపోయారు, ఏపీలో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు
తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, ప్రజలకు న్యాయం చేయక పోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయిందని పవన్ ఎద్దేవా చేశారు. ఆ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చుకోవద్దని హితవు పలికారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటామంటే ఇక్కడా అదే పరిస్థితి దాపురిస్తుంది. ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చి, ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష పేరుతో తెరపైకి కొత్త డ్రామాలు తీసుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
కరెంట్ తీసి దాడికి యత్నం, బట్టలూడదీసి కొడతా
పలాసలో రాత్రి సమయంలో తాను విడిది చేసిన కళ్యాణ మండపంలో కరెంట్ తీసి తనపై దాడికి ప్రయత్నించారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాను అన్నింటికి తెగించి వచ్చానని చెప్పారు. కిరాయి గూండాలను పంపించారని, అలాంటి వారు వస్తే బట్టలు ఊడదీసి కొడతానని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధిలేక వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకని నిలదీశారు.
భరతమాతకు గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం, అందుకే మిలటరీ చొక్కా
స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం అని, భరతమాతకు గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం అని పవన్ అన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనబడతాడని, జైహింద్ అంటాడన్నారు. వారికి స్ఫూర్తిగానే తాను ఈ రోజు మిలటరీ చొక్కాను వేసుకున్నట్టు తెలిపారు. సీపీఎస్ పెన్షన్ విధానంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారని, విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు, నీళ్లు.. తదితర సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలన్నారు. ప్రజలపై ప్రభుత్వాలకు ప్రేమ కావాలన్నారు.
వాళ్ల కోసం నేను పోరాటం చేస్తా
ఒక్కరోజు ఎమ్మెల్యేగా, ఒక్కగంట ముఖ్యమంత్రిగా, ఒక్కరోజు ఎంపీగా ఉన్న వాళ్లెవరైనా రిటైర్ అయితే వాళ్లకు జీవితకాలం పెన్షన్ వస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు ముప్పై ఏళ్లు పని చేసినా గానీ ఈ స్కీమ్తో వాళ్లకు పెన్షన్ వచ్చే ఆధారాన్ని భయాందోళనలోకి నెట్టేశారన్నారు. వారిని పట్టించుకొనే నాథుడు లేరన్నారు. వాళ్ల కోసం పోరాటం చేస్తానని, మత్స్యకారుల జీవిత ప్రమాణాలను పెరిగే వరకు జనసేన వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్ధానం కిడ్నీ సమస్యపై దృష్టి పెట్టడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని, జనసేన అండగా ఉంటుందన్నారు.
ఆ రోజు చేసిన పనికి ఇప్పుడు చింతిస్తున్నా
2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయనందుకు ఇప్పుడు బాధపడుతున్నానని పవన్ చెప్పారు. ఓట్లు చీలకుండా ఒక బలమైన ప్రభుత్వం వచ్చేందుకు తాను అలా చేశానని, ఆ రోజు చేసిన పనికి ఇప్పుడు చింతిస్తున్నానని చెప్పారు. కొన్ని స్థానాలలోనైనా పోటీ చేయాల్సి ఉండిందన్నారు. పరిశ్రమ స్థాపించేటప్పుడు మెజార్టీ ప్రజల అభిప్రాయం తీసుకోవాలన్నారు. సభలు పెట్టి, తీర్మానాలు చేయాలన్నారు. పునరావాస చ్రయలు చేపట్టకుండా ప్రాజెక్టులు కడితే మళ్లీ సోంపేట థర్మల్ ప్రాజెక్టు ఉదంతాలు పునరావృతమవుతాయన్నారు.