ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు: ప్రమాదమంటూ పోలీసుల అనుమతి నిరాకరణ
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర సోమవారం జిల్లాలో ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై తలపెట్టిన కవాతుకు రంగం సిద్ధమైంది.
Recommended Video
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక నుంచి ధవళేశ్వరం వరకూ చేపట్టనున్న కవాతు దాదాపు 1.30 గంటల పాటు కొనసాగనుంది. దీంతో ఇప్పటికే జనసైనికులు భారీగా చేరుకుంటున్నారు.
భారీ బహిరంగసభ
అనంతరం సోమవారం 4.30 గంటలకు ధవళేశ్వరంలోని బ్యారేజీ దిగువన ఉన్న కాటన్ విగ్రహం సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ శ్రేణులు, వలంటీర్లు పూర్తి చేశారు. 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయనున్నారు. పార్టీ జెండాతో కూడిన ప్రత్యేక వస్త్రధారణ కలిగిన 10 వేల మంది పవన్ వెనక నడుస్తారు. మిగిలిన శ్రేణులు, అభిమానులు వారిని అనుసరిస్తారు.
2లక్షలమంది..
కాగా, కవాతులో పాల్గొనటానికి వస్తున్న వారికి పార్కింగ్ స్థలాలను సైతం సిద్ధం చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వారి కులవృత్తులను ప్రతిబింబించేలా పనిముట్లతో కవాతులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని సమన్వయకర్త కందుల దుర్గేష్ తెలిపారు.
పోలీసుల బందోబస్తు..
బ్యారేజీపై కవాతు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బ్యారేజీ కింద గోదావరిలో దాదాపు 200 మంది గజ ఈతగాళ్లు, 15 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. పార్టీ నియమించిన 1500 మంది వలంటీర్లతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసులు కూడా బందోబస్తుకు రానున్నారు.
ప్రమాదమంటూ పోలీసుల అనుమతి నిరాకరణ
ఇది ఇలావుంటే, ధవళేశ్వరం బ్యారేజీపై వేలాదిమందితో కవాతు నిర్వహించడం ప్రమాదకరమని పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కూడా ప్రమాదమని సూచించారు. ఇరిగేషన్ అధికారులు కూడా బ్యారేజీపై వేలాది మందితో కవాతు నిర్వహించడం వల్ల ప్రమాదమని, ఇది పురాతన కట్టడమైనందున ఊహించని ఘటనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులకు లేఖ రావడంతో.. వారు జనసేన కవాతుకు అనుమతి నిరాకరించారు. వేరేచోట కవాతును, సభను నిర్వహించుకోవాలని నోటీసులు ఇచ్చారు. కవాతుకు సిద్దమవుతున్న తరుణంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయంపై జనసేన ఆలోచిస్తున్నట్లు తెలిసింది.