ఇదేనా మీ రియల్ టైమ్ గవర్నెన్స్ ?...క్వారీ ప్రమాదంపై సిఎంకు పవన్ కళ్యాణ్ ప్రశ్న
Recommended Video
కర్నూలు:రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సచివాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ ద్వారా చూస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబుకి పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలు కనిపించడం లేదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో క్వారీ పేలుడు దుర్ఘటన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రారంభిస్తే రాయలసీమ వరకూ ప్రతి చోటా అక్రమ మైనింగే సాగుతోందని, ఇందులో జరిగే పేలుళ్లతో ప్రజల ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం శోచనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.
వెనకేసుకు రావడం...తప్పు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో క్వారీ లో పేలుళ్లు జరిగి 10 మంది మృతి చెందినా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినా సిఎం చంద్రబాబు మంత్రులను, పార్టీ కార్యకర్తలను వెనకేసురావడం శోచనీయమని పవన్ తప్పుబట్టారు. హత్తిబెళగల్ లో ప్రమాదం జరిగిన ఘటనా స్థలం వద్ద పవన్ కూలీలు, పోలీసులు, ప్రజలను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేలుళ్ల ధాటికి తునాతునకలైన వాహనాలను, భారీ గుంతలను, ఎండిపోయిన చెట్లను ఆయన చూసి పవన్ చలించిపోయారు.
పవన్ ...సెల్ ఫోన్ లో నిక్షిప్తం
ఘటనా స్థలం వద్ద కనిపిస్తున్న దృశాలన్నింటినీ తన ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. అనంతరం ఆయన హత్తి బెళగల్ గ్రామాన్ని సందర్శించారు. నాగరాణి అనే వృద్దురాలు తన సమస్యను చెప్పుకునేందుకు వస్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆమెను తన దగ్గరకు పిలిపించుకొని సంఘటన తీరుతెన్నుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన తనకు చాలా బాధ కలిగించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పసిబిడ్డలు, ఆడపడచులు తిరిగే ప్రాంతంలో మైనింగ్కు అనుమతులివ్వ డమేమిటని ఆయన మండిపడ్డారు.
అక్రమ మైనింగ్ వల్ల...ప్రజలకు ఇబ్బందులు
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన అండగా ఉంటుందని హామీనిచ్చారు. పేలుళ్లతో హత్తి బెళగల్ గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వీధిలైట్లు వెలగకున్నా రియల్టైమ్ గవర్నెన్స్ ద్వారా సచివాలయంలో ఉండి చూస్తానని చెప్పే ముఖ్యమంత్రికి పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలు కనిపించడం లేదా అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని, పార్టీ నాయకులకు వంత పాడకుండా బాధితులకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
క్షతగాత్రులకు...పరామర్శ
అనంతరం పవన్ కళ్యాణ్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులను పవన్ పరామర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పని చేస్తోందా అని మండిపడ్డారు. మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లాలో దాదాపు 1600 క్వారీలకు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇచ్చిందని పవన్ ధ్వజమెత్తారు. వాటిలో సగానికిపైగా అక్రమ క్వారీలు ఉన్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. స్థానికంగా ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తెచ్చారని పవన్ తెలిపారు. వాటిపై సరైన సమయంలో స్పందిస్తానని పేర్కొన్నారు.