వైసీపీ గుర్తింపు రద్దయ్యేలా.. పవన్ కల్యాణ్ షాకింగ్ స్కెచ్..
సాధారణ ఎన్నికల వాసన ఇంకా పోకముందే.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.. సాధారణంలో దారుణంగా చతికిలపడ్డ జనసేన పార్టీ.. స్థానికంలో సత్తా చాటుకునేందుకు పక్కాగా ప్రపేర్ అయింది.. కానీ నామినేషన్ల పర్వంలోనే పెద్ద ఎత్తున హింస చెలరేగడం.. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలు వాయిదాపడటం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల వాయిదాను తప్పుపట్టిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జనసేన పార్టీ ముఖ్య నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఇంచార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పలు షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇప్పుడు వదిలేస్తే 2024 ఎలా?
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చెలరేగిన హింస, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, అధికార వైసీపీ చెందినవాళ్లు.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని, ఈ వ్యవహారమంతా అధికార యంత్రాంగం కనుసన్నల్లోనే జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రేరేపిత హింసకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం చేస్తానని ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో గనుక జనసేన మౌనంగా ఉండిపోతే.. వచ్చే సార్వత్రిక (2024) ఎన్నికల్లో వైసీపీ మరింతగా పేట్రేగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వైసీపీ పోల్ వయలెన్స్
ఎన్నికల హింసపై ఆదివారం రాజమండ్రిలో బీజేపీ నేతలతో కలిసి మాట్లాడిన విషయాన్ని కూడా పవన్.. జనసైనికులుకు గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో హింసకు సంబంధించిన ఫొటో, వీడియో ఆధారాలను సేకరించారని, వైసీపీకి అనుకూలంగా హింసకు సహకరించిన లేదా బాధితుల పట్ల అలసత్వం వహించిన అధికారుల వివరాలను కూడా సేకరించాలని పవన్ నేతలను ఆదేశించారు. ఇందుకోసం ‘వైఎస్సార్సీపీ పోల్ వాయలెన్స్' హ్యాష్ ట్యాగ్ తో సమాచారాన్ని పోస్టు చేయాలని సూచించారు.
వైసీపీ గుర్తింపుపై..
స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో వైసీపీ ఆధ్వర్యంలో సాగిన హింసకు సంబంధించిన అన్ని వివరాల్ని సేకరించి, వాటన్నింటినీ స్వయంగా కేంద్ర హోం శాఖకు అందజేస్తానని, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళతానని పవన్ చెప్పారు. తద్వారా రాజకీయ పార్టీగా వైసీపీ గుర్తింపు రద్దయ్యేలా.. తర్వాతి రోజుల్లో ఏ ఎన్నికల్లోనూ జగన్ పార్టీ పోటీ చేయకుండా నిషేధానికి గురయ్యేలా చేయాలన్నది జనసేనాని ఎత్తుగడ అని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అండదండలు.. అభినందనలు..
జనసేన ముఖ్య నేతలతో సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేస్తూ అనూహ్యంగా గుండెపోటుతో చనిపోయిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన కార్యకర్త అర్జున రావు కుటుంబానికి రూ.1లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు జనసేన తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన పలు జిల్లాల ప్రజాప్రతినిధులనూ ఆయన అభినందించారు.