ప్రత్యక్ష పోరాటం, రాజీనామాలు చేయండి: జగన్, చంద్రబాబు పార్టీలకు పవన్ కళ్యాణ్ సవాల్
అమరావతి: ఏపీ రాజధాని విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. ఈ కాన్ఫరెన్స్ లో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్, పీఏసీ సభ్యులు కె. నాగబాబు, ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, సత్య బొలిశెట్టి పాల్గొన్నారు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 11మంది మృత్యువాతపడటంపై సమావేశం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరచి, సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. రాజధాని వికేంద్రీకరణ, సి.ఆర్.డి.ఏ. రద్దు అంశాలపై జనసేన పీఏసీ చర్చించింది.
తేల్చేసిన పవన్ కల్యాణ్... మూడు రాజధానులపై మరోసారి కుండ బద్దలు...
రాజీనామాలు చేయండి..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతున్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి అమరావతిని నిలుపుకొనేందుకు పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలుపెట్టాలని సూచించారు.
మేమే మొదటగా రాజీనామా చేసేవాళ్లం: పవన్
జనసేన పార్టీకి శాసన ప్రక్రియలో ఏ కొద్దిపాటి భాగస్వామ్యం ఉన్నా మొదటగా రాజీనామాలు చేసేదన్నారు. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతు పక్షపాతంతో గొంతు వినిపించిందీ... ఒకే మాటపై నిలిచిందీ జనసేన మాత్రమే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పాత కక్షల కోసమా.. క్లిష్ట స్థితినుంచి బయటపడేందుకా?
కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అన్ని విధాలా కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లాంటివి మాట్లాడటం బాధ్యతాయుతం కాదు అని మన పార్టీ భావించింది. అయితే ఇలాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఓ క్రీడకు తెర తీశారు. పాత కక్షల కోసమో, ప్రస్తుత క్లిష్ట స్థితి నుంచి బయటపడేందుకో రాజధాని అంశాన్ని పాలకపక్షం నడిపిస్తోందని వ్యాఖ్యానించారు.
జగన్, చంద్రబాబులను నిలదీయండి...
రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టిడిపి పార్టీలు రెండూ ఒకలాంటివే. రూ.లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తాం అని తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు రూపొందించిన సమయంలోగానీ, మూడు రాజధానులుగా మారుస్తామని వైసీపీ నిర్ణయించిన సమయంలోనూ జనసేనకు ప్రమేయం లేదు. తప్పు చేసింది వైసీపీ, తెలుగుదేశం పార్టీలయితే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు. నిలదీయాలనుకున్న వారు ఆ రెండు పార్టీల పెద్దలను నిలదీయాలి. అసలు అమరావతి నిర్మాణం విషయంలో ఆది నుంచి ఇప్పటి వరకూ జనసేన ప్రమేయమే లేదు. అయితే బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అన్యాయమవుతున్న రైతుల పక్షాన పోరాడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పార్టీ ఆర్థికావసరాలకు అనుగుణంగా రాజధాని మార్చుకొంటారా?
వ్యక్తిగత అజెండాలు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా రాజధానులు ఉండవు. తమ పార్టీ ఆర్థికావసరాలకు అనుగుణంగా రాజధానులను మార్చుకొంటామంటే కుదరదు. భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా రాజధానిగా అమరావతే ఉండాలని, అందుకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయినప్పుడు కూడా అమరావతి గురించి చర్చించాం. అమరావతికి నిధులు ఇస్తామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిధులు ఆగిపోయాయని చెప్పారు.
అహ్మదాబాద్ లో 2014లో నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా.. రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు అని చెప్పాను. అప్పుడు వారు ఒక మాట అన్నారు.. ‘మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు మా గుజరాత్ కీ రాజధాని లేదు. గాంధీనగర్ ను క్రమక్రమంగా అభివృద్ధి చేసుకొంటూ వచ్చాం. ఈ అభివృద్ధికి పాతికేళ్లుపట్టింది. అదే విధంగా ఎలాంటి హంగులు ఆర్భాటాలకుపోకుండా క్రమ పద్ధతిలో ఏపీ రాజధానిని నిర్మించుకోండి అని సూచించారు. తెలుగుదేశం నాయకత్వం కూడా తొలుత 2500 ఎకరాల నుంచి 3వేల ఎకరాలు ఉంటే రాజధానిని నిర్మించుకోవచ్చు... అటవీ భూమిని డి-నోటిఫై చేయమని కోరింది. అందుకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకొందని పవన్ వివరించారు.