ఇక 2019 అంత సులభం కాదు: నాలుగేళ్ల తర్వాత.. బాబుకు పవన్ భారీ షాక్, ఒక్కో పాయింట్తో ఇలా
గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన తన ప్రసంగంలో టీడీపీని ధనుమాడారు. మహానుభావుడు ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ దోపిడీ తండ్రి చంద్రబాబుకు తెలియదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2014లో చంద్రబాబుకు మద్దతు పలకడం నుంచి ఈ రోజు వరకు పవన్ ప్రతి అడుగు టీడీపీకి అనుకూలంగా కనిపించిందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడు, జగన్ ఆయనను ఇరకాటంలో పడేసినప్పుడు పవన్ బయటకు వస్తున్నారని అంటారు.
నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి, ఒక్కో పాయింట్ లాగి
కానీ తొలిసారి చంద్రబాబుపై పవన్ ఘాటుగా విమర్శలు చేశారు. ఏపీలో దారుణమైన అవినీతి కనిపిస్తోందని, అందులో లోకేష్ పాత్ర కూడా ఉందని, ఇది చంద్రబాబుకు తెలిస్తే యంత్రాంగంపై పట్టులేకపోవడం, తెలిసి జరిగితే రాష్ట్రానికి మంచిది కాదని మండిపడ్డారు. నాలుగేళ్ల తర్వాత ఈస్థాయిలో చంద్రబాబుపై పవన్ దాడి చేయడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఒక్కో అంశంతో బాబును ఏకిపడేశారు. తాను రాజకీయాన్ని ఎంచుకోలేదని, అదే వచ్చిందని, భగవంతుడు తనకు ఇంతమంది అభిమానులను ఇచ్చింది మీకు సేవ చేసేందుకు కావొచ్చన్నారు.
టీడీపీ పునర్నిర్మాణం కాదు, ఏపీ పునర్నిర్మాణం
తాను చంద్రబాబుకు మద్దతివ్వడానికి ఆయన అనుభవమే కారణమని పవన్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. బుధవారం నాటి సభలోను అదే చెప్పారు. అయితే, ఈ నాలుగేళ్లలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి మూడు మాటల్లో ఆరు అబద్దాలు కనిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఓడిపోయి ఉంటే తనను ఏమనేవారో అందరికీ తెలుసు అన్నారు. తాను ఏపీ పునర్నిర్మాణం కోసం టీడీపీకి మద్దతిచ్చా కానీ, టీడీపీ పునర్నిర్మాణం కోసం కాదన్నారు.
రాజధాని నిర్మాణంపై
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు చాలని తనతో చంద్రబాబు అన్నారని, కానీ ఇప్పుడు వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాలకు విస్తరించిందని మండిపడ్డారు. ఏపీకి ఏం పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఎలా ఇస్తారన్నారు. రాజధాని చుట్టూ అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశంలు ఏం కావాలన్నారు. అభివృద్ధి కొంతమేరకు పరిమితం కావొద్దన్నారు. ఇలా ఉంటే తెలంగాణ ఉద్యమంలా మరో ఉద్యమం ఏపీలో వస్తుందన్నారు. ఆ కోణంలో బాబు ఆలోచించాలని, నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజీ
ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు అంగీకరించారని, పాచిపోయిన లడ్డూలను ఆప్యాయతతో అప్యాయతతో తింటామని టీడీపీ చెప్పిందని, ప్యాకేజీ చట్టబద్దత అన్నారని, కానీ ఇప్పుడు వాళ్లే చట్టబద్దత కల్పించలేదని చెబుతున్నారన్నారు. సీఎం, చంద్రబాబు ఇలా అబద్దాలు మాట్లాడుతున్నారని, అంటే ప్రజలకు తెలివితేటలు లేవని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 2016లో తాను హోదా చెప్పానని, టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టును కేంద్రంతో మాట్లాడుకొని ప్రయివేటు కాంట్రాక్టుకు ఇప్పించారని, ముంపు మండలాలను ఆర్డినెన్స్ తో రప్పించుకున్నారని, అలాంటి చిత్తశుద్ధి ఉంటే హోదాపై ఎందుకు లేదన్నారు. ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. హోదా కోసం తాను అవసరమైతే కేంద్రాన్ని నిలదీసి చనిపోయేందుకు సిద్ధమన్నారు.
జనసేనపై విమర్శలపై, చనిపోయేందుకు సిద్ధం
తాను సభలను పెట్టి, ఓసారి మాట్లాడి వెళ్లిపోతానని కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కానీ మీకు దమ్ముంటే భారత ప్రభుత్వంపై మాట్లాడాలని టీడీపీ, వైసీపీలను ప్రశ్నించారు. నన్ను, జనసేనను ప్రశ్నించే హక్కు లేదన్నారు. నా మాతృభూమికోసం చనిపోయేందుకు సిద్ధమన్నారు.
అమరావతిపై చంద్రబాబు భావోద్వేగం
చంద్రబాబు అమరావతిపై భావోద్వేగానికి లోనయ్ారని, కానీ గుంటూరులో కలరా వచ్చి చనిపోతే, శ్రీకాకుళంలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 55 మంది చనిపోతే ఆయన హృదయం కరగలేదా అని ప్రశ్నించారు. వారు మీ ఇంటి బిడ్డలు కాదా అన్నారు. ఇందుకే మీకు మద్దతిచ్చానా, దోపిడీ చేస్తే ఊరుకోవాలా అన్నారు.
టీడీపీ అవినీతిపై, 2014 అంత సులభం కాదు
నాడు మోడీ ఏపీని స్కామాంధ్ర కాకుండా చూడాలని చెప్పారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం కరప్షన్ ఆంధ్ర చేసిందన్నారు. టీడీపీకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఇసుక ధర పెంచారని, భవన నిర్మాణానికి ఖర్చు పెంచారని బాబుపై మండిపడ్డారు. 2019లో మీకు ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు. మీరు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, పాలించాలంటే పెట్టి పుట్టాలా అన్నారు. మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ లోకేష్ అంటూ లోకేష్ అవినీతిని ఏకిపారేశారు. మహానుభావుడు ఎన్టీఆర్ మనవడు లోకేష్ అవినీతి చంద్రబాబుకు తలియదా అన్నారు. ఎంత తింటారని ప్రశ్నించారు. చంద్రబాబుపై వ్యక్తిగతంగా గౌరవం ఉందని, ఏపీలో కరప్షన్ చాలా ఉందని తాను ఇటీవల చంద్రబాబుకు చెప్పానని, భారతదేశంలో లేని కరప్షన్ ఉందన్నారు. ఇలాగే చేస్తే ఏపీ సరికొత్త నాయకుడ్ని ఎన్నుకుంటుందని, 2019 ఎన్నికలకు చంద్రబాబుకు 2014 అంత సులభం కాదన్నారు. అవినీతిపరులను తరిమితరిమి కొట్టాలన్నారు. తనకు పెద్దవాళ్ల అవసరం లేదన్నారు. జనసేన ఉందన్నారు.
బాబు వైఫల్యాలు ఇవిగో
చంద్రబాబు వైఫల్యాలు ఇవీ అంటూ చంద్రబాబు ఫాతిమా బాధితులను వేదిక పైకి పిలిచారు. విద్యార్థులు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. మీకు అండగా నిలడితే ఇదా మీరు చేసేది అన్నారు. మీకు మోకరిల్లాలా అని ప్రశ్నించారు. ఓట్లు ఎందుకు అడిగారని, హామీలు ఎందుకు నెరవేర్చలేదన్నారు. 1980 నుంచి రాజకీయ మార్పులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు సరికొత్త శకం ప్రారంభమైందన్నారు. ఈ రోజు నుంచి మీ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎర్రచందనం అమ్మితే అద్భుత రాజధాని అని చెప్పి, ఏం చేశారన్నారు. మాకు చంద్రబాబు సత్యాలు చెప్పాలని, కల్లిబొల్లి మాటలు కాదన్నారు.
ఈ ప్రభుత్వానికి మద్దతివ్వను.. తేల్చేసిన పవన్
అక్వా ఫుడ్ పార్కుపై పవన్ మండిపడ్డారు. అందరూ పర్యావరణంతో కూడిన అభివృద్ధి కోరుకుంటే చంద్రబాబు సహా కొందరు పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కారన్నారు. ఓ మహిళ కాలుష్యంపై పోరాడితే ఆమెపై దాడి చేసి 40 రోజులు జైల్లో పెడతారా అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుంటే మహిళా అధికారి వనజాక్షిపై దాడి చేస్తారా, ఎమ్మెల్యేకు అండగా ఉంటారా అని ప్రశ్నించారు. సహనం పరీక్షించవద్దన్నారు. మహిళా అధికారిపై దాడులు చేస్తే సర్దుకుపోతారా అని ప్రశ్నించారు. చట్టం మీకు వర్తించదా అన్నారు. సింగపూర్ తరహా రాజధాని కావాలంటే అలాంటి పాలన కావాలన్నారు. భూమాతను అడ్డంగా తవ్వుతున్నారని, ఆ భూమాత మిమ్మల్ని భూమిలోకి లాక్కెళ్తుందన్నారు. ప్రజలను హింసించే ఈ ప్రభుత్వానికి మద్దతివ్వనని తేల్చి చెప్పారు. ఉద్దానం, ఓటుకు నోటు అంశాలను కూడా ప్రస్తావించారు.