క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్తో పవన్
హైదరాబాద్: జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ సోమవారం 'ఆత్మీయ సదస్సు' పేరుతో సంధ్య కన్వెన్షన్ హాలులో మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్తో భేటీ అయ్యారు. పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. జనసేనకు మద్దతిస్తున్న అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం పెద్దలకు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు అన్నయ్య చిరంజీవి అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు, నమస్కారాలు అన్నారు.
Recommended Video
జగన్ గెలిస్తే ఏం చేస్తాడో భయంగా ఉందని బాబు ఇంటికి పిలిచి చెప్పారు: పవన్ షాకింగ్
ఇంత ప్రేమతో, అన్నయ్య చిరంజీవి గారి సీనియర్ అభిమానులు జనసేన ఎవరిదో కాదని, చిరంజీవి అభిమానుల్లో ఒకరిది అన్నారు. ఇది బయటి వారిది కాదన్నారు. నేను ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఎందుకు పెట్టలేదంటే, నాకు అన్నయ్యే హీరో అన్నారు. అన్నయ్య సినిమాల్లోకి రాకముందు నచ్చిన హీరో అమితాబ్ బచ్చన్ అని, అన్నయ్య వచ్చాక ఆయననే అభిమానించానని, అంతలా ఎవరినీ అభిమానించలేదన్నారు. ప్రజారాజ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించేవారు లేక జనసేన పెట్టవలసి వచ్చిందన్నారు.
కర్ణాటక కంటే రసవత్తరం: పవన్ 'కింగ్ మేకర్' ఆశలు, అదే జరిగితే చుక్కలే!
చిరంజీవి చిన్నస్థాయి నుంచి ఎదిగాడు, అందుకే నా హీరో
నాకు ఇష్టమైన హీరో చిరంజీవి మాత్రమేనని పవన్ అన్నారు. కేవలం హిట్ సినిమాలు ఉన్నాయని మాత్రమే కాదన్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు వ్యక్తి అయిన తన అన్నయ్య చిరంజీవి, బీకాం చదువుకొని, చిన్న పల్లెటూరు నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబం వచ్చి ఎదిగాడన్నారు. సినిమాల్లోకి రాకముందే ఆయన తన హీరో అన్నారు. నేను నచ్చిన ఇద్దరు హీరోలు అమితాబ్, చిరంజీవిలను ఒకే వేదికపై సైరా నర్సింహా రెడ్డి షూటింగులో ఇటీవల కలిశానని చెప్పారు. అది ఎంతో ఆనందమన్నారు.
చిరంజీవిని అంటే కొట్టేవాడిని, నేను హీరోను అనుకోలేదు
నేను ఎప్పుడూ హీరోను అనుకోలేదని, అందుకే పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టలేదని జనసేనాని చెప్పారు. నేను మొదటి నుంచి చిరంజీవి అభిమానినే అన్నారు. నేను చిరంజీవి మీద మాట పడనిచ్చేవాడిని కాదన్నారు. ఎవరైనా చిరంజీవిని ఓ మాట అంటే వెళ్లి కొట్టేవాడిని అన్నారు. అందుకే తనకు దూకుడు ఎక్కువ అని పేరు వచ్చిందన్నారు. మీరు నన్ను తిట్టినా నాకు కోపం రాదన్నారు. చిరంజీవి రాజకీయ జీవితానికి దూరమై, మళ్లీ సినిమాలపై మనస్ఫూర్తిగా దృష్టి పెట్టారన్నారు.
గమ్యం ఒకటే అయినా, భిన్నమనస్తత్వాలు
జనసేన ఒక రాజకీయ సామాజిక మార్పు కోసం ఇదే హైదరాబాదులో పుట్టిందని పవన్ చెప్పారు. ప్రజలు వేరు, నాయకులు వేరని చెప్పారు. నాయకుల వల్ల ప్రజల మధ్య మనస్ఫర్థలు రావొద్దని చెప్పారు. ఒకే కుటుంబంలో ఉండి భిన్నమనస్తత్వాలు ఉంటాయని, కానీ వారు వేరు అని కాదన్నారు. గమ్యం ఒకటే అయినా భిన్న మనస్తత్వాలు, భావాలు ఉండవచ్చునని చెప్పారు. ఆ భిన్నత్వాలు అర్థం చేసుకోకుంటే ఇతరులకు వేర్వేరుగా కనిపిస్తాయని, కానీ అది వైరుధ్యం మాత్రమే అన్నారు. దానిని అర్థం చేసుకోకుంటే గొడవలు అన్నారు.
నన్ను తిడితే పడతాను కానీ
నేను చిన్నప్పటి నుంచి శాంతిమంత్రమే నేర్చుకున్నానని పవన్ అన్నారు. నన్ను వ్యక్తిగతంగా ఎంత తిట్టినా పడతానని చెప్పారు. కానీ సమాజం దోపిడీకి గురవుతుంటే, సమాజంలో వివక్ష ఉంటే నాకు ఆవేదన, కోపం వస్తుందని చెప్పారు. స్వామి నాయుడు, నూర్ మహమ్మద్ తదితరులు మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చారని చెప్పారు. ఇంతమంది ప్రేమాభిమానాలతో హాజరై, పార్టీలో చేరినందుకు సంతోషమన్నారు.
నేను ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను
ప్రస్తుతం నేను ఛాలెంజింగ్ పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నానని పవన్ చెప్పారు. మొక్క మొలకెత్తడానికి మాను కావడానికి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని, జనసేన కూడా అంతేనని చెప్పారు. జనసేన భావజాలంతో యుద్ధం చేస్తోందని చెప్పారు. ఏపీలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ఓ భావజాలం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మహిళలకు, యువతకు, రైతులకు ఏం చేయగలమో అలా చేయాలన్నారు. జనసేన దేని కోసం పని చేస్తుందనే విషయాన్ని ఇజం అనే పుస్తకంలో తెలిపానని, ఏడు సిద్ధాంతాల్లో తెలిపానని అన్నారు.
చిరంజీవిని చూశాకే తెలిసింది
నేను షూటింగులకు వెళ్లడంపై తప్పుపడతారని పవన్ గుర్తు చేశారు. నేను సినిమాల్లో ఎవరినైతే ప్రమోట్ చేస్తానో వారి వల్ల కొన్ని ఇబ్బందులు రావొచ్చన్నారు. హిట్ అయితే వారి వల్ల, ఫట్ అయితే ఇతరుల వల్ల అని చెబుతారన్నారు. నేను చిరంజీవి ఎత్తుపల్లాలను చిన్నప్పటి నుంచి చూశానని చెప్పారు. చిరుకు హిట్ వస్తే అంత ఎత్తున పెడతారని, ఫట్ అయితే పట్టించుకోరని అందుకే తాను సినిమా ఫంక్షన్లు చేసుకోనని చెప్పారు.
మంచి చేద్దామంటే అడ్డంకులు
తన ఓ సినిమా హిట్ అయితే ఫంక్షన్ బదులు ఏదైనా చేద్దామంటే అడ్డంకులు వచ్చాయని, అప్పుడే తనకు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఎన్జీవో కంటే రాజకీయ పార్టీ ద్వారా సాధించవచ్చునని అర్థమైందన్నారు. అప్పుడు తన డబ్బులు కార్గిల్ వార్ కోసం వదిలేశానని చెప్పారు. పవన్ అలా మాట్లాడినప్పుడు.. అభిమానులు సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పవన్ ఇంకా మాట్లాడుతూ.. ఈ దేశంలో ఏ పార్టీది ఒక విధానం కాదన్నారు. తెలంగాణ కోసం బీజేపీ, లెఫ్ట్ పార్టీలు కలిశాయని, పశ్చిమ బెంగాల్లో సిపిఐ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని, కేరళలో మాత్రం పొత్తు ఉండదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ ఏ పార్టీ అయినా కచ్చితమైన విధివిధానాలు లేవన్నారు. నేను మాత్రం ప్రజాపక్షం అన్నారు. అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా... తన విధానానికి ఏ ఇజం అయినా పేరు పెట్టుకోండన్నారు.
నాతో ఎదిగి, నా చేయి నరికినా ఏమీ అనను
నేను చేయూతనిచ్చిన మనుషులు కూడా పైకి ఎదిగాక, నా చేయి నరికినా నేను ఏమీ అననని పవన్ చెప్పారు. ఎందుకంటే నేను సత్యాన్ని ఎప్పటికైనా గెలుస్తుందని నమ్ముతానని చెప్పారు. సరికొత్త రాజకీయ వ్యవస్థకు జనసేన కట్టుబడి ఉంటుందని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగింపు మాటలు అని పవన్ పేర్కొంటూ ఇలా మాట్లాడారు. స్వామినాయుడు సహా ప్రతి అన్నయ్య అభిమానులను ప్రత్యేకంగా కలుస్తానని, అందరం మళ్లీ కలుద్దామని చెప్పారు. మనస్ఫూర్తిగా మీకు జనసేన అండదండలుగా ఉంటుందని చెప్పారు. అన్నయ్య అభిమాన సంఘాల నాయకులతో మరోసారి కలుస్తానని చెప్పారు.