ప్రచారానికి నేను, ఫోన్ చేస్తే లైన్లోకి రాలేదు: బీజేపీ ఎంపీపై పవన్, బాబూ ఇక్కడకొచ్చి కూర్చో
Recommended Video
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాను తాను ఎప్పుడూ మరిచిపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నారు. తనకు భీమవరంలో ఇంత అపూర్వ స్వాగతం లభించిందన్నారు.
ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి జనసేన ఎదగాలని భీమవరం నాయకులు కోరుకున్నారని చెప్పారు. అలాంటి వారందరికీ జనసేనలోకి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. 2019లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అనుభవం కోసమే ఇన్నాళ్లు వేచి చూశానని చెప్పారు. అనుభవజ్ఞుడనే చంద్రబాబుకు 2014లో మద్దతిచ్చానని చెప్పారు.
గోదావరి జిల్లాలకు దిష్టి పెట్టారు
తన తండ్రిది గోదావరి జిల్లా అయినప్పటికీ తాను గోదావరి జిల్లాల్లో పెరగలేదని పవన్ చెప్పారు. గోదావరి జిల్లాకు దిష్టి తగిలిందన్నారు. ఎక్కడకు వెళ్లినా.. గోదావరి జిల్లా అంటే మీకు అన్నపూర్ణ ఉంది మీకేం అంటారని, అలా చెప్పీ చెప్పీ మనకు దిష్టిపెట్టారన్నారు. మనకు ఎటు చూసినా ఇక్కడ నీళ్లు ఉన్నాయని కానీ తాగడానికి నీళ్లు లేవన్నారు. దాని గురించి మాట్లాడేవాళ్లు, నిలదీసేవాళ్లు లేరన్నారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అంటూ ముక్తకంఠంతో అరుస్తున్నారని, కానీ స్వచ్చ భారత్ కోసం ఎంపీ గోకరాజు డంపింగ్ యార్డ్ కోసం స్థలం చూపించలేకపోయారన్నారు. 2014లో చంద్రబాబు, మోడీ, గోకరాజు గంగరాజులతో కలిసి భీమవరంలో ప్రచారానికి వచ్చానని, ఇక్కడ అభివృద్ధి కోసం మద్దతిచ్చానని చెప్పారు.
ప్రచారానికి రావాలంటే ఎంత డబ్బు తీసుకుంటారని అడిగారు
పవన్ ప్రచారానికి రావాలంటే ఎంత డబ్బు తీసుకుంటారని కొందరు స్నేహితులతో గోకరాజు రంగరాజు అడిగారని, కానీ తనను, జనసేనను డబ్బులతో కొనలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రేమతో పిలిస్తే అండగా ఉంటామని చెప్పారు. సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. టీడీపీకి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొత్తం 15 సీట్లు వచ్చాయని, కానీ వారు ఏం చేయలేరన్నారు. అది టీడీపీ గొప్పతనం కాదని, ఇక్కడి ప్రజల గొప్పతనం అన్నారు. ఏరు దాటాక తెప్పతగిలేసినట్లు టీడీపీ గోదావరి జిల్లా ప్రజలను వదిలేసిందన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు, అడవి బాపిరాజు వంటి మహానుభావులు పుట్టిన ఈ ప్రాంతంలో కాలుష్యం బాధిస్తోందన్నారు.
నా గుండెల్లో పెట్టుకుంటా
పశ్చిమ గోదావరిని మరిచిపోయారా అని కొందరు తనను అడుగుతుంటారని పవన్ అన్నారు. మాది ఇక్కడ సాధారణ కుటుంబం అన్నారు. మా పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని, అలాంటప్పుడు నేను దీనిని ఎందుకు మర్చిపోతానని, నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆచితూచి మాట్లాడుతానని చెప్పారు. రాజకీయాల కంటే ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చానని చెప్పారు.
జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదు, అధికారం స్థాపించే పార్టీ
జనసేన అంటే ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదని, అధికారాన్ని స్థాపించే పార్టీ అని పవన్ అన్నారు. ఇన్ని కోట్ల కుటుంబాలను (రాష్ట్రం) నడిపేందుకు అనుభవం రావాలని తాను పోటీ చేయలేదని చెప్పారు. దశాబ్దకాలం తనకు అనుభవం ఉచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. టీడీపీ ఇసుక మాఫియాతో పాటు మట్టి మాఫియాకు కూడా పాల్పడుతోందని గోదావరి జిల్లాకు వచ్చాక తెలిసిందని పవన్ అన్నారు. టీడీపీ, వైసీపీ అవినీతి కంపు కొడుతోందని మండిపడ్డారు. దోపిడీని ఆపకుంటే బాగుండదన్నారు. చుట్టూ నీరున్న తాగునీరు మాత్రం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా ఇక్కడ కూడా నీటిలో ఎర్రలు వస్తున్నాయన్నారు. 2014 తర్వాత క్రమపద్ధతిలో పార్టీని నిర్మిస్తూ వచ్చానని చెప్పారు.
ప్రచారం కోసం నేను కావాలి, ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు
బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజును నేను ఓ ప్రశ్న అడుగుతున్నానని, ఆయన తరఫున తాను ప్రచారం చేశానని, కానీ ఇన్నాళ్లు ఆయనను ఏమీ ఆశించలేదన్నారు. ప్రచారం కోసం తనను అడిగారని, కానీ ఇటీవల ఓ అవసరం కోసం గొడవ సమయంలో ఆయనను అడుగుదామంటే తనకు కనీసం ఫోన్లో కూడా దొరకలేదన్నారు. ఓడ ఎక్కాక ఓడ మల్లయ్య, ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా గోకరాజు తీరు ఉందన్నారు. కనీసం డంపింగ్ యార్డు తీసుకురాని టీడీపీ పశ్చిమ గోదావరికి ఏం చేశామని చెప్పుకుంటారని పవన్ ప్రశ్నించారు. వాజపేయి పేరు మీద రోడ్ల వైండింగ్కు సంబంధించి స్కీం ఉందని, గోకరాజు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు.
పంచాయతీ ఎన్నికలు పెట్టాలని సవాల్
పంచాయతీ ఎన్నికలు పెట్టకుంటే కేంద్రం నుంచి నిధులు రావని పవన్ అన్నారు. అప్పుడు మేం తప్పకుండా పోటీ చేస్తామన్నారు. కానీ చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికలు పెట్టే ఆలోచన లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు పెడితే, వాటిలో ఓడిపోతే ఆ ప్రభావం... అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని ఆయన భయపడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల్లో దోపిడీలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వలాభం తప్ప ప్రజలకు పని చేయడం లేదన్నారు. తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, మీ తరఫున పోరాడేందుకు వచ్చానని చెప్పారు.
చంద్రబాబు ఇక్కడకు వచ్చి కూర్చో తెలుస్తుంది
మేం రోడ్లు వేశామని మంత్రి లోకేష్ మాట్లాడుతారని, అసలు మీ డబ్బులతో వేశారా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు భార్యాబిడ్డలు, మనవళ్లతో ఇక్కడకు వచ్చి కూర్చుంటే ప్రజల సమస్యలు, దుస్థితి తెలుస్తుందన్నారు. డంపింగ్ యార్డ్ దూరంగా ఉందన్నారు. దూరంగా ఎక్కడో ఓ దేవాలయం ఉన్నచోట డంపింగ్ యార్డ్ పెడతారా అని ప్రశ్నించారు. ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేసే పార్టీ అధికారంలోకి రావాలని, అది జనసేన అన్నారు. ఇన్ని జబ్బులు వస్తున్నా కనీసం ఆరోగ్య శాఖ మంత్రి లేరన్నారు. ఒకప్పుడు గోదావరి అన్నపూర్ణ అని, కానీ కాంగ్రెస్, టీడీపీల పాలనలో నష్టపోయాయన్నారు.