20న ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర, ఇలా చేస్తే విద్వేషాలు: బాబుకు పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: ఈ నెల 20వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం వెల్లడించారు. ఉధ్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం నుంచే పోరాటంను ప్రారంభిస్తానని చెప్పారు. ప్రజలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.
ప్రజలకు అన్యాయం చేస్తే...ప్రభుత్వంపై జనసేన తిరుగుబాటు చేస్తుంది:పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే ఇలాగే ఉంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయని పవన్ కళ్యాణ్ పరోక్షంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. జనసేన మేనిఫెస్టో టీం కూడా బస్సు యాత్రలో పాల్గొంటుందని తెలిపారు. కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాది మంది ప్రజలు బలవుతున్నారని చెప్పారు. జనసేన మొదటి నుంచి ఒకే మాటపై ఉందన్నారు.
ఉత్తరాంధ్రలో దాదాపు 45 రోజుల పాటు బస్సు యాత్ర సాగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదాపై 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో నిరసన కవాతు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తన యాత్రలో సమస్యల పరిశీలనతో పాటు పరిష్కారం పైన కూడా దృష్టి సారిస్తానని చెప్పారు. 2019 ఎన్నికలే తమ లక్ష్యమని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామన్నారు.