అవి స్టడీ చేస్తున్న పవన్కళ్యాణ్, దీక్ష ఇప్పుడేకాదా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ ప్రాంతంలో రైతుల నుండి భూసేకరణ చట్టం కింద భూమిని సేకరిస్తే జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఆయన దీక్ష చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
పవన్ దీక్ష పైన జనసేన పార్టీకి చెందిన వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానిని ఖండించడం లేదా ధ్రువీకరించడం జరగలేదు. అయితే, భూసేకరణ చట్టం ఉపయోగించి రైతుల నుండి బలవంతంగా భూములను తీసుకుంటే అప్పుడు నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
ప్రస్తుతం భూసమీరణే చేస్తున్నందున ఇప్పటి వరకు దీక్ష పైన ఆలోచించలేదని తెలుస్తోంది. మరోవైపు భూసేకరణ చట్టంలోని 2, 3 అధ్యాయాల మినహాయింపు పైన పవన్ కళ్యాణ్ అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ చట్టం పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు స్పందించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే, ఆ చట్టాన్ని రైతుల పైన రుద్దితే తాను రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.
భూసేకరణ చట్టాన్ని బలవంతంగా రుద్దితే తాను తప్పకుండా రైతుల తరఫున ముందుకు వస్తానని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఆయన మరోసారి స్పందించారు.
భూసేకరణ పైన రైతులకు నచ్చ చెప్పిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రైతులకు లాభనష్టాలను ప్రభుత్వం వివరించాలన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా దీనిని పరిష్కరించుకోవాలన్నారు.