టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!
అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. రాష్ట్రం లో జరగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడిపి ప్రభుత్వాన్ని తారా స్దాయిలో తప్పుబట్టిన వైసీపి నేతలు ప్రస్తుతం చేస్తున్నదేంటని సూటిగా ప్రశ్నించారు. వైసిపి ఆద్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుర్తు చేసారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ప్రస్తుత వైసీపి ప్రభుత్వం కూడా ఇసుక అక్రమాలు కొనసాగిస్తోందని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపై కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేయడం ఏంటిని వైసీపి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాన్ సూటిగా ప్రశ్నించారు.
ఏపిలో ఇసుక అక్రమ దందా జరుగుతోంది.. అన్ని ప్రజలు గమనిస్తున్నారన్న జనసేనాని..
కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడానికే ప్రజానీకం ఆందోళన చెందుతూ ఉంటే అధికారంలో ఉన్నవారి తీరు మరో విధంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ వారు ఇసుక, మట్టి లాంటివాటిని అక్రమంగా దోచుకున్నారని, ఆ తప్పులను పునరావృత్తం కాకుండా చూడాల్సిన ప్రస్తుత వైసీపి ప్రభుత్వం చేస్తుంది ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇసుక, మట్టి, గ్రావెల్ లాంటి వనరులను అక్రమంగా ఎలా తవ్వేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సమయం వచ్చినప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు గబ్బర్ సింగ్.
గతంలో వైసిపి నీతులు చెప్పింది.. ఇప్పుడు మాట తప్పిందన్న పవన్..
వైసిపి నేతల ఇసుక దందా, అక్రమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. జిల్లాలో కరోనా మూలంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షల సమయంలో సాగిస్తున్న ఇసుక తవ్వకాలు, ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూ సేకరణ, విద్యుత్ బిల్లుల సమస్య, రైతాంగం ఇబ్బందులను ఈ కాన్ఫరెన్స్ లో పవన్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం తక్కువే లాంటి మాటలతో నిర్లక్ష్యంగా ఉండకూడదని ముందస్తు జాగ్రత్తలు సూచించారు పవన్.
కరోనా ఆంక్షల తర్వాత కార్యాచరణ.. శ్రేణులకు పిలుపునిచ్చిన గబ్బర్ సింగ్..
కరోనా మహమ్మారి విజృంభిస్తే చికిత్స అందించేందుకు తగిన ఆసుపత్రుల సామర్థ్యం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు సరిపోవు కాబట్టి అవగాహనతో నిబంధనల ప్రకారం జీవించడానికి అలవాటుపడాలని ప్రజలకు సూచించారు. కరోనా వ్యాప్తి మూలంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోసం ఆలోచించాలని అన్నారు. అందుకే జనసేన పార్టీ తరఫున రాజకీయాల కంటే ప్రజలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు చేయాలని దిశానిర్దేశం చేసారు పవన్ కళ్యాణ్. బాధ్యతగా వ్యవహరించల్సిన అదికార పార్టీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు.
Recommended Video
వైసీపి వనరులను దోచుకొంటుంది.. రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కళ్యాణ్..
ఇసుకను అక్రమంగా రవాణా చేసే వాహనాలు ఇష్టారీతిన తిరుగుతున్నాయని, నియంత్రించే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోడం వెనక ఆంతర్యం ప్రజలకు అర్ధమవుతోందని పవన్ స్పష్టం చేసారు. సముద్ర తీరంలో రక్షణగా నిలిచే మడ అడవులను కాకినాడలో ధ్వంసం చేసేశారని, ఈ అక్రమ చర్యపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేస్తే విచారణకు ఆదేశించిందని పవన్ గుర్తు చేసారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల కోసం కొబ్బరి తోటలు నరికేయడం, పైగా ఆ భూములను అక్రమంగా భూసేకరణ పరిధిలోకి తీసుకువరావడం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని పవన్ హెచ్చరించారు. ప్రజా సమస్యలపైనా, వనరులను దోచుకొంటున్న తీరుపైనా జనసేన రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, లాక్ డౌన్ ఆంక్షల సడలింపుల తరవాతా జనసేన పోరాటాన్ని సాగిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.