పవన్ కళ్యాణ్ చెప్పారు, వారికి విజ్ఞప్తి చేస్తున్నాం: పత్తిపాటి
విజయవాడ: ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను తీసుకోవాలని, రైతులతో చర్చలు జరిపి వారిని ఒప్పించి భూములు తీసుకోవాలని చెప్పారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. భూములు ఇవ్వాలని ఉండవల్లి, పెనుమాక, బేతపూడి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా 1300 ఎకరాల అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూములను తీసుకుంటామని ఆయన చెప్పారు. తూళ్లూరు మండలంలోని 300 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాజధాని కోసం ఇప్పటి వరకు 33,600 ఎకరాలు సేకరించినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుంటే, రాజధాని కోసం భూసమీకరణ జరిగిన ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నిడమర్రు వంటి కొన్ని గ్రామాలలో కూడా అక్కడక్కడ కొంత మేరకు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఈ గ్రామాల నుంచి సుమారు 1200 నుంచి 1300 ఎకరాలు అందాల్సి ఉంది. ఈ గ్రామాలలో కూడా కొంతమంది రైతులు మొదటి నుంచి భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారు. జనసేన నాయకుడు పవన్కళ్యాణ్ పెనుమాకలో పర్యటించి భూసేకరణ చేయవద్దని చెప్పి వెళ్ళారు.
ఆ తరువాత కూడా కొంత మంది రైతులు స్వచ్చందంగా భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. శంకుస్థాపన కోసం వేసిన రోడ్లు, అభివృద్ధి చూస్తున్న రైతులలో కొంత ఊగిసలాట కనిపిస్తోంది. జాయింట్ కలెక్టర్ శ్రీధర్ వీరితో మాట్లాడుతూ భూసమీకరణకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ప్రాంతాలలో ఉన్న భూములకు అధిక విలువ ఉండటంతో ఆఖరి ప్రయత్నంగా ప్రభుత్వం ప్యాకేజీని కొంచెం పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటికి కూడా రైతులు ముందుకు రాకపోతే భూసేకరణ ద్వారా తీసుకోవడం లేదా గ్రీనరీ ప్రాంతం కింద ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.