బాబు ద్రోహం చేశారు! జగన్ మాటమార్చారు: ఏపీ నలిగిపోతోందంటూ పవన్
పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కులాలను విడదీసి రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. చంద్రబాబు అన్ని కులాలకు ద్రోహం చేశారని అన్నారు. పోరాట యాత్రలో భాగంగా నరసాపురంలో శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
రిజర్వేషన్లపై సాధ్యపడేవే చెప్పాలని చంద్రబాబుకు తాను చెప్పానని పవన్ తెలిపారు. హామీలిచ్చి ఇప్పుడు కోర్టుల్లో పెట్టారని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా తుని ఘటన జరిగినప్పుడు స్పందించలేదని అన్నారు. తాను కేరళ నుంచి వచ్చానని తెలిపారు. తాను కులాల మధ్య చిచ్చుపెట్టనని అన్నారు. రాష్ట్రాన్ని, పార్టీని నడపాలంటే అందర్నీ కలుపుకుని పోవాలని అన్నారు.
కులాన్ని నమ్ముకుని రాలేదు.. బాబు గొడవలు పెట్టారు
తాను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని, అందర్నీ నమ్ముకుని వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు కాపులకు, బీసీలకు, మత్య్సకారులకు షెడ్యూల్డ్ కులాలకు, ఎస్సీ వర్గీకరణ పేరుతో గొడవలు పెట్టారని ఆరోపించారు. తాను మాట్లాడితే కులాన్ని నమ్ముకుని వచ్చాడని అంటున్నారని.. కులాన్ని నమ్ముకుని ఉంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిస్తానని పవన్ అన్నారు.
ఆ రెండు కుటుంబాల మధ్య ఏపీ నలిగిపోతోంది
అన్ని కులాలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన కొడుకు క్రిస్టియన్ అని, తాను కూడా జీసస్ని పూజిస్తానని పవన్ చెప్పారు. చంద్రబాబు, జగన్ పార్టీల కుటుంబాల మధ్య ఏపీ నలిగి పోతోందని అన్నారు. కులాలు బాగుపడట్లేదు కానీ, ఆ కుటుంబాలు మాత్రం బాగుపడుతున్నాయని అన్నారు.
బాబు ద్రోహం చేశారు.. జగన్ మాటమార్చారు
తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని పవన్ అన్నారు. బీసీలకు చంద్రబాబు అండగా ఉంటే.. తమకు అన్యాయం జరుగుతోందని వారు తన వద్దకు ఎందుకు వస్తారని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలకు, కాపులకు ద్రోహం చేశారని అన్నారు. జగన్ కూడా మాట మార్చారని అన్నారు.
జనసేనకు అవకాశం
దేశానికి, రాష్ట్రానికి జనసేన, పవన్ కళ్యాణ్ ఏమివ్వాలో ఆలోచించానని అన్నారు. టీడీపీని మళ్లీ ఎన్నుకుంటే మనకు జరిగేది ద్రోహమేనని అన్నారు. 30ఏళ్లు టీడీపీని చూశాం.. జగన్ తీరును చూశాం.. ప్రజలకు అండగా ఉండే జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని పవన్ అన్నారు. పాతికేళ్లు సేవ చేయడానికి, ప్రజల కన్నీళ్లు తుడవడానికే వచ్చానని పవన్ చెప్పారు.
అలా చెప్పను.. మేనిఫెస్టో..
సీఎం అయితేనే సమస్యలు తీరుస్తానని తాను చెప్పననని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు. టీడీపీ పాలనలో రోడ్లు కూడా లేవని అన్నారు. మత్స్యకారుల సమస్యలను టీడీపీ పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. నిరుద్యోగ సమస్య బాధ కలిగిస్తోందని అన్నారు. తాను త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఫైనల్ మేనిఫెస్టోను ఎన్నికల ముందు రిలీజ్ చేస్తానని చెప్పారు. జిల్లా ప్రజలకు చేసే పలు అభివృద్ధి పనులను పవన్ వివరించారు.
టీడీపీ లంచాలు
పరిశ్రమలు పెట్టాలంటే టీడీపీ నాయకులు తమకెంత అని అడుగుతారని.. అందుకే పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదని పవన్ ఆరోపించారు. పరిశ్రమలు రాకపోవడంతో ఉద్యోగాలు కూడా రాలేదని, యువత నిరుద్యోగులుగా మారరని అన్నారు. తాను రోడ్డు మీదకు రావడానికి నిరుద్యోగ యువతే కారణమని అన్నారు.
పేరుపాలెం బీచ్ ను అభివృద్ధి చేసి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అన్నారు.
టీడీపీ సర్కారు అవినీతిమయం
ఏ సమస్య ఉన్నా జనసేన వద్దకు రండి అండగా ఉంటామని పవన్ చెప్పారు. లంక గ్రామాలకు రక్షణ గోడలను కూడా టీడీపీ ప్రభుత్వం నిర్మించలేదని మండిపడ్డారు. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు అవినీతి మయంగా మారాయని ఆరోపించారు. రుణాలు ఇవ్వాలంటే లంచాలు అడుగుతున్నారని అన్నారు. అభివృద్ధి ఏమోగానీ అవినీతి మాత్రం చేస్తున్నారని టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.