ఆ లడ్డూలు కూడా లేవు, పుండు మీద కారం, పాలించే హక్కులేదు: మోడీపై పవన్ సంచలనం
హైదరాబాద్/అమరావతి: విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత ప్యాకేజీ అన్నారని, కానీ అది కూడా ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అన్నారు. జేఎఫ్సీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విభజనకు ముందు తాను బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని, అందువల్ల నైతికంగా నేను ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అందరూ తనను నిలదీస్తున్నారని చెప్పారు. ఏపీకి పదిహేనేళ్లు హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని, అది తాను నమ్మానని చెప్పారు.
ఇప్పుడు పాచిపోయిన లడ్డూలు కూడా రావట్లేదు
గతంలో తాను తిరుపతి సభలో పాచిపోయిన లడ్డూలు అని కేంద్రంపై విమర్శలు చేశానని, కానీ ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూలు కూడా రావడం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాము పాచిపోయిన లడ్డూలు అయినా తీసుకుంటామని అప్పుడు టీడీపీ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు అవి కూడా రావడం లేదని గుర్తించాలన్నారు.
హోదా ఇస్తేనే సరైన న్యాయం
ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బీజేపీ, ఆ హోదాను ప్యాకేజీ చేసిందని, ఇప్పుడు ఆ ప్యాకేజీని కూడా ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సరైన న్యాయం జరుగుతుందన్నారు. హోదాకు సమానమైనది ఏదీ కాదన్నారు. ఇబ్బందులు లేకుండా పోలవరం సరైన సమయంలో పూర్తి చేయాలన్నారు.
2014లో బీజేపీ గెలుపుకు కృషి చేశా
2014లో ఎన్డీయే విజయానికి తనవంతు కృషి చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఏపీకి హోదానే కాదు, కనీసం ప్యాకేజీకి కూడా నిధులు ఇవ్వలేదని చెప్పారు. ప్యాకేజీ అంటే పాచిపోయిన లడ్డూతో సమానం అన్నారు. హోదా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. హోదా ఇస్తానని చెబితేనే తాను నమ్మానని చెప్పారు.
పుండుమీద కారం చల్లుతున్నారు
పార్లమెంటులో ఇచ్చిన మాటకు విలువ లేకుంటే ప్రజలు ఎలా మీపై నమ్మకం పెట్టుకుంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఓసారి మాట ఇచ్చాక దానిని వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. అందరూ ప్రజలను వాడుకొని వదిలేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుండు మీద కారం చల్లుతున్నాయన్నారు.
విభజన వయబలిటియా, పాశ్వాన్ కోసం ఏర్పాటు చేయలేదా
రైల్వే జోన్ విషయంలో వయబలిటి కాదని చెబుతున్నారని, మరి రాష్ట్ర విభజన వయబిలిటినా అని పవన్ కళ్యాణ్ బీజేపీని ప్రశ్నించారు. నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చింది 5 శాతం మాత్రమే అన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ కోసం రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదా అని నిలదీశారు. ఏపీకి పోర్టు వస్తే దాని వల్ల ఆదాయం ఎక్కువ వస్తుందన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. హామీలు నిలబెట్టుకోలేకుంటే ప్రజలను పాలించే హక్కు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.