చంద్రబాబు వల్లే: విశాఖకు నష్టమెలా జరిగిందో చెప్పిన పవన్, అజ్ఞాతవాసి ఫెయిల్యూర్పై
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశాఖ పర్యటనలో అధికార పార్టీ టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు. గురువారం వివిధ చోట్ల ఆయన విమర్శలు గుప్పించారు. రంగాపురం వైట్ హౌస్లో సమావేశంలో విశాఖలో నివసిస్తోన్న ఉత్తర భారతీయుల సమస్యలను గురించి తెలుసుకున్నారు. గాజువాక సభలో.. ఇలా పలుచోట్ల మాట్లాడారు. గాజువాకలో ఎంతోమంది యువత ఉన్నారని చెప్పారు.
చొక్కాపట్టి రోడ్డుపైకి లాగుతా, అదే ఉంటే నీకు మద్దతిచ్చేవాడినా?: బాబుపై పవన్
కానీ వారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా అడిగితే స్కిల్స్ లేవని అంటారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం గాజువాక రైతుల భూములు తీసుకొని వారిని మోసం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూదోపిడీ పెరిగిందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దోపిడీల రాజ్యం వస్తుందని చెప్పారని, కానీ మీరు చేసిందేమిటని టీడీపీని ఘాటుగా ప్రశ్నించారు. ఈ నెల 7న విశాఖపట్నంలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. మన కవాతు గల్లీ నుంచి ఢిల్లీస్థాయికి తెలియాలని అన్నారు.
విశాఖపట్నంకు నష్టం ఎలా జరిగిందంటే?
విశాఖపట్నంకు నష్టం ఎలా జరిగిందో చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖకు కార్పోరేషన్ ఎన్నికలు జరగలేదని, ఎన్నికలు జరిగి ఉంటే కనుక మనకు రూ.3500 కోట్లు కేంద్రం నుంచి నిధులు వచ్చేవన్నారు. ఎందుకంటే ఆ నిధులు ఎన్నికలు జరిగితేనే వస్తాయన్నారు. ఇక్కడ ఎన్నికలు జరిగితే మేం కాకుండా ఇంకా ఎవరు వస్తారోననే భయం టీడీపీకి ఉందని, అందుకే జరగలేదన్నారు. మనం రాకుంటే ఆ డబ్బులు మన చేతిలో పడవనే భయమన్నారు. అన్ని ప్రజలకు వెళ్లిపోతాయనే భయంతో ఎన్నికలు జరగలేదన్నారు.
టీడీపీని బాబు స్థాపించారా, నాకు బంధువులే పెద్దగా తెలియదు
జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తారని, అసలు చంద్రబాబుకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. టీడీపీని చంద్రబాబు స్థాపించారా అని నిలదీశారు. వైసీపీ అధినేత జగన్లా తన తండ్రి ముఖ్యమంత్రి కాదని, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ అన్నారు. మన ఇంట్లో.. మీలో ఒకరు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుందో అదే జనసేన అన్నారు. వాళ్లలా వేల కోట్లు లేవన్నారు. మా బంధువులు అందరినీ కూర్చోబెట్టి రాజకీయం చేసేందుకు నాకు పెద్దగా బంధువులే తెలియదని పవన్ అన్నారు. నా బంధువులు అంతా అభిమానులు, ప్రజలే అన్నారు.
మన సంస్కృతిని మార్చేందుకు చాలామంది ప్రయత్నించారు కానీ
ప్రాంతాలు, జాతులు, కులాల కలయికే భారత్ అని పవన్ అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారన్నారు. మనది వసుదైక కుటుంబమని, మన సంస్కృతిని మార్చేందుకు చాలామంది యూరోపియన్లు ప్రయత్నించారని, కానీ వాళ్లే మారిపోయారన్నారు. భారతీయతను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తమదే అన్నారు. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
అజ్ఞాతవాసి ఫెయిలైతే డబ్బులు తిరిగిచ్చా
2014లో టీడీపీ, బీజేపీకి తాను మద్దతిస్తే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ విశాఖలో భూకబ్జాలు, కాలుష్యాన్ని పెంచి పోషిస్తోందన్నారు. తాను సినిమాల్లో సంపాదించి, జనసేనను స్థాపించి మళ్లీ ప్రజలకే ఖర్చు చేస్తున్నానన్నారు. తాను నటుడిని అవ్వాలని అనుకోలేదని, కానీ అయ్యానని, చాలా తక్కువ సినిమాలు తీసినా భగవంతుడి కృప వల్ల 100 సినిమాలు తీసిన ఇమేజ్ వచ్చిందన్నారు. ఏమీలేని స్థాయి నుంచి రూ.25 కోట్లు పన్నులు కట్టే స్థాయికి వచ్చానన్నారు. తనకు డబ్బు వద్దని, సమతుల్యత, శాంతి కావాలన్నారు. అందుకే తాను అజ్ఞాతవాసి ఫెయిలైనా తిరిగి డబ్బులు ఇచ్చేశానన్నారు.