నేను బొమ్మను కాదు, సరికొత్త రాజకీయ వ్యవస్థ, నాకు 5గురు ఎమ్మెల్యేలు ఉంటే: జగన్కు పవన్ చురక
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో టీడీపీ, వైసీపీ, బీజేపీలపై విరుచుకు పడ్డారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్నారు. సీఎం కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. 2019లో కచ్చితగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు.
చదవండి: మీరు కష్టపడితే నేనే సీఎం!: శ్రీకాకుళం పర్యటనలో పవన్ కీలకవ్యాఖ్యలు
2019లో సరికొత్త ప్రభుత్వం, పదవి ఆశిస్తే అలా చేసేవాడిని
2019లో కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అప్పుడు సరికొత్త ప్రభుత్వం వస్తుందన్నారు. ఓట్లు కొనే రాజకీయాలు వారివి అయితే, మనవి మనుసులు దోచుకునే రాజకీయాలు అన్నారు. ఓట్లు కొనే రాజకీయాలను రూపుమాపుదామన్నారు. నవసమాజ నిర్మాణం కోసం అన్నా హజారే, కేజ్రీవాల్ల వలే అవినీతిరహిత పాలన కోరుకుంటున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు.
సరికొత్త మార్పు కోసం పార్టీని స్థాపించానని చెప్పారు. పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అలాగే వచ్చి ఉంటే ఇతర పార్టీలు ఇచ్చే పదవులు తీసుకునేవాడినని చెప్పారు. 2009లో ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేసేవాడినని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీని బీజేపీలో కలపమని చెప్పారని, పదవి ఇస్తానని చెప్పారన్నారు. తనకు పదవులపై మమకారం లేదన్నారు. 2009లో 294 నియోజకవర్గాలకు గాను 285 స్థానాల్లో పోటీకి సంబంధించిన అనుభవం తనకు ఉందన్నారు. కానీ నేను ఎప్పుడు నాకంటే అనుభవజ్ఞులకు గౌరవం ఇస్తానని చెప్పారు.
చదవండి: మళ్లీ చంద్రబాబు దుమ్ముదులిపిన పవన్ కళ్యాణ్
మాకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి ఉంటే
నాకు అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే అన్నింటి పైన సమర్థవంతంగా పోరాడేవాడినని పవన్ చెప్పారు. కానీ వైసీపీ అసలు సభకే వెళ్లడం లేదన్నారు. ప్రతిపక్షానికి అంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఏం లాభమన్నారు. ప్రతిపక్షం సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు. మత్స్యకారులు గోడు వెళ్లబోసుకోవడానికి తన వద్దకు వస్తే గంగపుత్రులకు, అడవి తల్లి బిడ్డలకు గొడవపెట్టి రాజకీయం చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులకు తోడు రొయ్యల చెరవుతో మరింత కాలుష్యం చేస్తున్నారన్నారు. వారికి ప్రజలను వంచించే అపార అనుభవం ఉందని బాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై బీజేపీ తప్పులు చేసిందన్నారు.