నేను సీఎం కావాలంటే, టీడీపీదీ అదే తీరు, బీజేపీని ప్రశ్నించే హక్కులేదు: పవన్ కళ్యాణ్
అమరావతి: ప్రజలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం ప్రభుత్వాలకు సరికాదన్నారు. తెలుగుదేశం, బీజేపీలు హామీలను నెరవేర్చకపోవడం వల్లే నేను ప్రజలలోకి వచ్చానని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే మొదట మీ సమస్యలు నాకు అర్థం కావాలన్నారు.
20న ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర, ఇలా చేస్తే విద్వేషాలు: బాబుకు పవన్ కళ్యాణ్
శుక్రవారం ఆయన గంగవరం వెళ్లి పోర్టు నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ మాట్లాడారు. సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన ముఖ్యమంత్రిని కాలేనని చెప్పారు. సమస్యలు అర్థం చేసుకుంటేనే అవుతానని చెప్పారు.
అవకాశమిస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వం
ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని అందిస్తానని పవన్ చెప్పారు. నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పని చేయరాదని, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయన్నారు. అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.
కేంద్రం హామీలు నెరవేర్చలేదు
ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని, పార్లమెంటులో మాటలు ఇస్తారని, వాస్తవ రూపంలో మాత్రం వాటిని నెరవేర్చరని, దీనిని నిలువరించాలని పవన్ కళ్యాణ్ అంతకుముందు రోజు అన్నారు. రాజకీయ జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేంద్రంప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చలేదని, దీనిపై సరైన సమయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనసేన ఈ విషయంలో మొదట్నుంచీ ఒకే మాట మీద ఉందన్నారు.
పోరాట యాత్రతో ప్రజల్లోకి
అందుకే మేం పోరాట యాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది యువత, విద్యార్థులతో నిరసన కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లాలో పర్యటన ముగించబోయే ముందు లక్ష మంది యువతతో పెద్ద ఎత్తున నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. రాజకీయ జవాబుదారీతనం లక్ష్యంగా 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని తీరప్రాంతంలో గంగపూజ చేసి, జై ఆంధ్రలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించి 45 రోజుల జనసేన పోరాటయాత్ర ప్రారంభిస్తామన్నారు.
హార్వార్డ్ నిపుణులను రప్పిస్తే ప్రభుత్వం సహకారం తీసుకోలేకపోయింది
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి నుంచి అక్కడి వారిని కాపాడటానికి హార్వర్డ్ నుంచి నిపుణలను రప్పిస్తే వారి అమూల్యమైన సహాయ సహకారాలను ప్రభుత్వం తీసుకోలేకపోయిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఇలాగే విడిచిపెడితే ఇంకోసారి రాష్ట్రం విడిపోయే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో 372 మంది వరకూ ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయారని, వారి త్యాగాన్ని గుర్తించి గౌరవించుకోలేని దుస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారన్నారు.
బీజేపీని ప్రశ్నించే హక్కు లేకుండాపోయింది
ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక తరం రాజకీయ నాయకులు చూపిన నిర్లక్ష్యానికి, అలసత్వానికి కోట్ల మంది ప్రజలు బాధలు అనుభవిస్తున్నారని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అమరవీరుల బలిదానాలకు జ్ఞాపకంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన పోరాట యాత్రను బస్సు యాత్రగా భావించవద్దని, ఇది ప్రజా యాత్ర అన్నారు. అందరిలోనూ లోపాలున్నాయని, ప్రజాస్వామ్య పద్ధతులను దశాబ్దాలుగా నీరుగారుస్తూ ఇక్కడి వరకు తీసుకు వచ్చారని కర్ణాటక అంశంపై వ్యాఖ్యానించారు. ఒక్క బీజేపీనే కాదని, గతంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను కొనుక్కున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలూ కొనుగోళ్లు చేస్తున్నప్పుడు బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందన్నారు.