ఆ 10 లక్షలమంది నా కోసం రాలేదు: పవన్ కౌంటర్, జగన్కు చురకలు, ఆ పనులతో చంపొద్దని..
అమరావతి: జనసేన కవాతుకు దాదాపు 10 లక్షల మంది వచ్చారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చెప్పారు. లక్షలాది మంది కవాతుకు వచ్చింది తనను చూడటానికి కాదని, ప్రభుత్వంపై విసిగిపోయి రోడ్ల పైకి వచ్చారని చెప్పారు. కవాతు ఉద్దేశ్యం బలప్రదర్శన కాదని చెప్పారు. అధికార పార్టీకి బాధ్యత గుర్తు చేయడం అన్నారు.
బాబూ! మీకు అండగా ఉంటా: ఐటీ సోదాలపై పవన్ కళ్యాణ్ మెలిక! మళ్లీ చిరంజీవి ప్రస్తావన
చొక్కా పట్టుకుంటారని హెచ్చరిక
ప్రభుత్వం సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తే జనం చొక్కా పట్టుకుంటారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే అన్నీ చేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, మరి వైసీపీ అధికారంలోకి రాకపోతే ఎలాగని ప్రశ్నించారు. రేపు (బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితులను కలుస్తానని చెప్పారు.
Recommended Video
టీడీపీ నేతలకు కౌంటర్
అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, జలీల్ ఖాన్లు జనసేనానిపై విమర్శలు గుప్పించారు. కవాతుకు అంత డబ్బు ఎక్కడిదని, కవాతును అల్లు అరవింద్ నిర్వహించాడని అందరూ చెబుతున్నారని, శ్రీకాకుళం తుఫాను బాధితులను మేం ఆదుకుంటుంటే పవన్ కట్టె పట్టుకొని కవాతు చేశారని, కమేడియన్ వచ్చినా జనం వస్తారని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రజలు తనను హీరోగా చూస్తున్నారా లేక పొలిటీషియన్గా చూస్తున్నారా అనేది పవన్ ఆలోచించుకోవాలన్నారు. తనను చూసేందుకు జనం వచ్చారన్న వ్యాఖ్యలపై, కవాతుపై చేసిన విమర్శలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.
జగన్కు చురకలు
కవాతుకు సహరించిన అందరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది. ఈ పది లక్షల మంది పలావుకు, సారా ప్యాకెట్కు ఆశపడి రాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులు బాధ్యతతో మెలగాలని చెప్పేందుకు వచ్చారన్నారు. ప్రతిపక్ష నేత బాధ్యతతో మెలగాలని, అసెంబ్లీకి వెళ్లాలని, సమస్యలపై మాట్లాడాలని, ముఖ్యమంత్రి అయ్యాకే చేస్తానంటే ఎలా అని జగన్కు చురకలు అంటించారు.
జనసేనను చంపేయకండి.. అనవసరంగా పార్టీని చంపేయకండి
తూర్పు గోదావరి జిల్లాలో పితాని బాలకృష్ణకు మినహా తాను ఎవరికీ సటు ఇవ్వలేదని, ఆ నిర్ణయం కూడా తన ఒక్కడిది కాదని, అనవసరపు పనులతో పార్టీని చంపేయవద్దని, మనకు కావాల్సింది అధికారం కాదని, మార్పు అని జనసైనికులకు కూడా పవన్ సూచించారు. పార్టీ కార్యకర్తలు, నేతల్లో పోటీ తత్వం పెరగాలన్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు ఐదుగురు కూడా లేరని, కానీ నమ్మకం, నేను వస్తే నా వెంట అంతా కదులుతారని భావించానని, అది నిజమైందని చెప్పారు.
కవాతులో పవన్ చేసిన వ్యాఖ్యలపై చర్చ
జగన్ మీద తనకు కోపం లేదని, ఆయన లక్ష కోట్లు తిన్నారో లేదో ఆ భగవంతుడికి తెలియాలని, కానీ 2007లో వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఓ సినిమా తీయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, కోట్ల మంది అభిమానులున్న తనలాంటి వాడినే అలా బెదిరిస్తే సామాన్యులను ఎంత బాధపెడతారో అని కోపం వచ్చిందని పవన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ స్పందించవలసి ఉంది.