ప్రజారాజ్యంతో దెబ్బతిన్నాం: టిక్కెట్లపై తేల్చేసిన పవన్ కళ్యాణ్, బాబూ! తెలంగాణలో జనసేననా?
అమలాపురం: చేనేతకు ఉన్న గొప్పదనాన్ని చెప్పేందుకే తాను పంచె కడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. ఆయన చేనేత కార్మికులతో భేటీ అయ్యారు. కులం పేరుతో గెలిచే నేతలు న్యాయం చేసిన పరిస్థితులు ఏపీలో లేవని చెప్పారు. వచ్చే ఫిబ్రవరిలో తాను భారీ చేనేత కార్మికుల సదస్సు నిర్వహించనున్నానని చెప్పారు.
కేసీఆర్! నిజమే, హైదరాబాద్ నేను కట్టలేదు, జగన్-పవన్ కళ్యాణ్ మద్దతిస్తారా?: చంద్రబాబు
తాను ముందు తరాలకు ప్రతినిధిని అని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబులా తాను వెన్నుపోటు రాజకీయాలు చేయనని చెప్పారు. ఎవరు తప్పు చేసినా నిలదీయవచ్చునని జనాలకు చెప్పారు. నేను తప్పు చేసినా ప్రజలు తన చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
ఈ రోజుల్లో అందరూ రెడీమేడ్ దుస్తులకు అలవాటుపడ్డారు
ఈ రోజుల్లో అందరూ రెడీమేడ్ దుస్తులు వేసుకోవడానికి అలవాటు పడ్డారని, అందుకే వారికి మీ కళ తాలూకు కష్టం తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను చేనేత వస్త్రాలు, పంచె ధరించడానికి ముఖ్య కారణం మీ కళను అందరికీ మరింతగా తెలియజెప్పేందుకేనని, మన తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికని చెప్పారు.
కులచిచ్చు పెట్టే పరిస్థితి
తనకు పాలించే కులాలు అని అనడం నచ్చదని, పాలించే కుటుంబాలు అని అంటానని, కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయని, కులాలు మాత్రం బాగుపడటం లేదని పవన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక చాలా రోజుల వరకు ఎవరూ కులాల ప్రస్తావన తీసుకు రాలేదని, ఆ తర్వాత వచ్చిన నాయకులు కులచిచ్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రజారాజ్యంతో దెబ్బతిన్నా.. ఎవరికి సీట్లు ఇస్తానో చెప్పిన పవన్
2009లో అన్ని కులాలకు న్యాయం చేయాలని ప్రయత్నించి నష్టపోయామని పవన్ కళ్యాణ్ తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి అన్నారు. మళ్లీ అలాంటి ప్రయత్నం తాను చేయలేనని అన్నారు. గెలిచే అభ్యర్థికి తప్పకుండా ఏ వర్గమైనా సీటు ఇస్తానని చెప్పారు. కానీ తాను కులాల ఆధారంగా ఇవ్వనని తేల్చి చెప్పారు. చేనేత వర్గం నుంచి గెలిచే సత్తా ఉన్న నాయకుడు ఉంటే కచ్చితంగా సీటు ఇస్తానని చెప్పారు.
ఓ సినిమాలో వాడితే అది ఫ్యాషన్ అయింది
తాను చిన్నపాటి కాశీ తువ్వాలును ఓ సినిమాలో వాడితే అది ఈరోజు ఫ్యాషన్ అయిందని, దానికి మార్కెట్ వచ్చి అవి నేసే వారి జీవితాలు బాగుపడ్డాయని పవన్ అన్నారు. మీరు ధైర్యంగా ఉండండని, మీకు ఇవ్వగలిగినన్నీ సీట్లు తాను చట్టసభల్లో కల్పిస్తామని, అవి కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో, సహకార సంఘాల్లో మీ సమస్యలు తీర్చగలిగే చోట మీకు స్థానం కల్పిస్తామని చెప్పారు. చేనేత వర్గం నుంచి మంచి నాయకులను తయారు చేస్తామని చెప్పారు.
జగన్లా దోచుకుంటే పనికివస్తానా
తాను చెప్పడం వల్లే టీడీపీకి ఓటు వేశానని కొందరు చెబుతున్నారని, అందుకు సంతోషమని పవన్ అన్నారు. దేశం బాగుండాలంటే యువతకు, మహిళలకు అవకాశం కల్పించాలని చెప్పారు. నేను మంత్రి నారా లోకేష్లా చచ్చు రాజకీయాలు, కుళ్లు రాజకీయాలు చేసేందుకు రాలేదని చెప్పారు. ఏమైనా అంటే పవన్ మంచి కుర్రాడు, కానీ రాజకీయాలకు పనికి రాడని చెబుతారని, అంటే మీ దృష్టిలో జగన్లా దుర్మార్గంగా వేలకోట్లు దోచుకునే వాళ్లు లేక చంద్రబాబులా మాటలు మార్చి, నీచ రాజకీయాలు చేసేవారు నేతలా అన్నారు.
మేం పోటీ చేయకున్నా తెలంగాణకు వెళ్లి జనసేన పేరు పలవరిస్తున్నారు
చంద్రబాబుకు జనసేన అంటే భయం పట్టుకుందని, అందుకే మేం పోటీ చేయకపోయినా తెలంగాణ వెళ్లి అక్కడ జనసేన, జనసేన అని మనల్ని తలుచుకుంటున్నారని, , అంత భయం దేనికి ముఖ్యమంత్రిగారూ.. అని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీని ఓడించి నూతన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని చెప్పారు. వారికి మళ్లీ పాలన అప్పగించవద్దని చెప్పారు. మీరు సీఎం సీఎం అని అరిస్తే కుదరదని, మన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పారు.