రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తాను ఒక కులాన్ని నమ్ముకొని, ఓ ప్రాంతాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. కులాల గోడలు బద్దలు కొట్టేందుకు వచ్చానని చెప్పారు. కొండారెడ్డి బురుజు నుంచి చెబుతున్నానని, జనసేన లేకుండా ఇక ముందు తెలుగు రాజకీయాలు ఉండవని చెప్పారు.
నేను ఎక్కడకు వెళ్లినా ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు
కొందరు అంగబలం, అర్థబలాన్ని సామాన్యుడిని నలిపేసేందుకు ఉపయోగిస్తున్నారని, మీరు కోరుకున్నట్లు నేను ముఖ్యమంత్రిని అయితే ఆ పరిస్థితులను మార్చుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు వేసే కేకలు మార్పుకి చిహ్నమని, రౌడీ రాజకీయాన్ని తరిమేద్దామని, యువత మార్పు కోరుకుంటోందన్నారు. భగవంతుడు ఇంత అభిమాన బలం ఇచ్చాడని, ఇంత అఖండ స్వాగతం ఇచ్చిన కర్నూలుకి ధన్యవాదాలు అన్నారు. ఎక్కడకు వెళ్లినా తనను చూసి ప్రజలు గుండెలు బాదుకుంటున్నారని, అందుకు ఈ ప్రభుత్వం తీరుపై ప్రజలు విసిగిపోవడమే కారణమని చెప్పారు. కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారని, ఆ స్వేచ్ఛ ఈరోజు మీరు సీఎం సీఎం అని అరిచేలా చేస్తోందన్నారు.
కర్నూలులో కొత్త రాజకీయం తీసుకు వస్తా
రెడ్డి అంటే ప్రజలను కాపాడేవాడే కానీ, దోచుకునేవాడు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. మనకు సంబంధించిన వాడే ముఖ్యమంత్రి, మంత్రి అంటే మార్పు రాదని, కులాలను కలుపుకొని రాజకీయం చేయాలని, అది జనసేన చేస్తుందన్నారు. రౌడీయిజం, గుండాయిజంతో యువత విసిగిపోయిందని, యువతకి ఉద్యోగాలు కావాలన్నారు. మీకు పెద్ద నాయకులు లేరని, పెద్ద వ్యక్తులు లేరు, డబ్బులు లేవని అందరూ అంటున్నారని, కానీ జనసేన మీలాంటి సమాన్యులతో మార్పు తెస్తుందని చెప్పారు. అన్యాయానికి ఎదురుగా నిలబడే జిల్లా కర్నూలు అని, ఇక్కడ కొత్త రాజకీయాన్ని తీసుకు వస్తానని చెప్పారు.
అందుకే కర్నూలు జిల్లాకు చెందిన రేఖను అధ్యక్షురాలిగా చేశా
ఎంతసేపు మనకు సంబందించిన వాడు, మన కులం వాడు ముఖ్యమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందనే విధానం పోవాలని, ఎవరు వచ్చినా అందరికి న్యాయం జరగాలని, అందుకే కులాలను విడదీయటం కాకుండా కులాలను కలిపే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్నానని పవన్ చెప్పారు. కాటమరాయుడు అంటే రాయలసీమకు సంబందించిన గొర్రెల కాపరి అని, ఆరోజు నెల్లూరు రాజులు అన్యాయంగా అతడిని శిక్షించాలని చూస్తే వారికి ఎదురుతిరిగిన ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే అన్నారు. వీరమహిళ విభాగానికి జిల్లాకు చెందిన రేఖను అధ్యక్షురాలిగా చేశానని, అందుకు ఆమెకు పోరాడగలికే శక్తి ఉండటమే కారణమని చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త రక్తాన్ని తీసుకు వస్తానని చెప్పారు. మార్పు రావాలంటే జేజేలు కొట్టడం కాకుండా, 18 ఏళ్లు నిండిన వారంతా జనసేనకు ఓటు వేయాలన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి గడగడలాడించారని, మరి అవినీతితో నిండిన ఈ వ్యవస్థలో మీలాంటి యువతతో కలిసి ఏదైనా సాధిస్తానని చెప్పారు.
కులాలకు, ముస్లీంలకు పంచడం కాదు.. సమానంగా పంచాలి
మనకి భయాలు లేవని, ఓటమికి బయపడేవాడికి గెలుపు రాదని, ఓటమికి భయపడనివాడికే గెలుపు ఉఉంటుందని పవన్ చెప్పారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకొని ఓట్లు వేయించుకుందామంటే మార్పు రాదని, ఎవరో ఒకరు మార్పు కోసం పోరాటం మొదలుపెట్టాలని, తనకు భయం లేదని, మీరిచ్చిన ధైర్యం ఉందని చెప్పారు. ఇక్కడకు తాను వచ్చినప్పుడు కులాలకు హామీలు ఇవ్వమని, ముస్లీంలను ఆకట్టుకోమని చెప్పారని, కానీ ఇది మన అందరి హక్కు అని, ఇక్కడ ఇచ్చేవాడు లేడని, అందరికీ సమానంగా పంచాలన్నారు. నేను అందరికీ సమానంగా అభివృద్ధిని పంచేందుకు వచ్చానని చెప్పారు. ముస్లీంలు మన దేశంలో అంతర్భాగమని, వారిని మైనార్టీలు అని ఎందుకు చెప్పాలని, ప్రత్యేకంగా దేశభక్తి నిరూపించుకోవాలా అన్నారు. వారు భారతీయులని నిరూపించుకోవాలా అన్నారు.
ఇన్ని హామీలా.. జగన్, చంద్రబాబులపై ఆగ్రహం
జనసైనికులే తన పేపర్లు, చానెళ్లు అని, మిమ్మల్ని నమ్మి వచ్చానే తప్ప ఏవో ఛానళ్లను కాదని పవన్ చెప్పారు. రాయలసీమకు ఉద్యోగాలు తీసుకు వచ్చే ధైర్యం, సత్తా జనసేనకు ఉందని చెప్పారు. మన బడ్జెట్ లక్ష, లక్షన్నర కోట్లయితే, ఈ ప్రభుత్వం, ప్రతిపక్షాలు నాలుగు లక్షల కోట్ల పథకాలు చెప్తారని, ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని, ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తారా అని చంద్రబాబు, జగన్లపై నిప్పులు చెరిగారు. నేను వారిలా అబద్దాలు చెప్పనని, వారి విధానాలు చూసి అసహ్యమేసిందని, వారిలా మిమ్మల్ని మోసం చేయనని అన్నారు. నేను మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని అధికారులతో చర్చించాకే ఇచ్చానని చెప్పారు.
టీజీ వెంకటేష్తో మాట్లాడుతా
నేను మీ అందరికి హామీ ఇస్తున్నానని, వచ్చే పాతిక సంవత్సరాలు మీతో ఉంటానని చెప్పారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నానని, జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద ఆన వేసి చెబుతున్నానని, ఎవ్వరు ఏం చేయాలని చూసినా సరే మార్పు సాధించి తీరుతామన్నారు. సీపీఎస్ గురించి ఇతర పార్టీలు ఎలా పని చేస్తాయో తెలియదని, జనసేన ఖచ్చితంగా రద్దు చేసేందుకు పోరాడుతుందని చెప్పారు. తన వద్ద వేల కోట్లు, న్యూస్ పేపర్లు లేవన్నారు. తుంగభద్ర నది మొత్తం కలుషితమైందని, పెద్ద పెద్ద వ్యక్తుల పరిశ్రమల సంస్థల వ్యర్థాలు అందులో కలిపేస్తున్నారని, పెద్దలు టీజీ వెంకటేష్తో మాట్లాడి తుంగభద్ర నది కాలుష్యాన్ని అరికడతానని చెప్పారు.