నేనెవరో అశోక్ గజపతిరాజు ఆ తర్వాతే మరిచారు: బాబు 40 ఏళ్ల అనుభవంపై పవన్ తీవ్రంగా
శ్రీకాకుళం: విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవం కలిగిన నాయకుడు కావాలని ఆ రోజు మీకు భుజం కాశానని, కానీ ఈ రోజు ఏపీని అవినీతిలో అగ్రగామిగా చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన సోమవారం సాయంత్రం రాజాంలో కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Recommended Video
అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
టీడీపీ అవినీతిని ప్రశ్నించినందుకు 9మంది జనసేన కార్యకర్తలను జైల్లో పెట్టారని మండిపడ్డారు. జిల్లాలో ఇసుకమాఫియా, భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతోందన్నారు.
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తాను గళం విప్పానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబితే నాడు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపిందన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మన ఆత్మాభిమానం దెబ్బతీశారన్నారు. హోదా విషయంలో చంద్రబాబు రెండేళ్ల కిందటే కళ్లు తెరిస్తే ఏపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
అప్పుడు పవన్ ఎవరో తెలుసు, ఇప్పుడు తెలియదు
పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు గతంలో వ్యాఖ్యానించారు. దానికి జనసేనాని కౌంటర్ ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో నేను ఎవరో ఆయనకు తెలుసునని, కానీ కేంద్రమంత్రి అయ్యాక మరిచిపోయారని, నేను ఎవరో తెలియదని వ్యాఖ్యానించారని అన్నారు. ఆయనకు ఉద్ధానం కిడ్నీ బాధితుల అరుపులు వినిపించడం లేదా అని నిలదీశారు.
వారు ప్రజలు కాదా చంద్రబాబు గారూ!
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వలసలను నివారించాలని పవన్ డిమాండ్ చేశారు. తాడుపూడిలో టీడీపీ జెండా పట్టుకుంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని, లేదంటే లేదని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న ఇతర పార్టీల వారు, మిగతా జనాలు ప్రజలు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదాపై ఎన్నోసార్లు చంద్రబాబు మాట మార్చారని, అలాంటి సీఎం చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ధర్మం లేదన్నారు.
టీడీపీ, వైసీపీలు లేకున్నా జనసేన ఉంటుంది
చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరం అని భావించానని, కానీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని పవన్ అన్నారు. అవినీతిలో, వెనుకబాటుతనంలో ఏపీ రెండో స్థానంలో ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకొనిపోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు లేకున్నా ఉన్నా జనసేన ఉంటుందన్నారు.
జనసేన ఉద్యమానికి తూట్లు పొడిచే పని చేసి, పంథా మార్చుకున్న టీడీపీ
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇసుక దోపిడీకి పనికి వచ్చిందని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సంపూర్ణంగా అవినీతిలో మునిగిపోయిందన్నారు. 2019లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఉత్తరాంద్రకి తీరని ద్రోహం చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లేకుండా చేస్తోందన్నారు. వీరఘట్టంలో పుట్టిన కోడి రామ్మూర్తి గారి స్ఫూర్తితో నేను మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకున్నానని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోనన్నారు. హోదాపై టీడీపీ పదేపదే మాట మార్చిందన్నారు. జనసేన మాత్రం ఎప్పుడూ ఒకే మాట మీద ఉందన్నారు. జనసేన ఉద్యమానికి తూట్లు పొడిచే పని చేసిన టీడీపీ ఇప్పుడు తన పంథా మార్చుకొని ప్రత్యేక హోదా అంటోందన్నారు.