బట్టలూడదీసి కొడదాం! త్వరలో: ఆర్కేకు పవన్ ట్వీట్ వార్నింగ్, టీవీ9 రవిప్రకాశ్ చెప్పుతో దాడి అంటూ..
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 యాజమానులపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగా బురదజల్లుతున్నారని ఆరోపణలు చేస్తూ టీవీ 9 రవిప్రకాశ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై జనసేనాని నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే.
శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై!
ఉదయం ఏడున్నర.. ఎనిమిది గంటల సమయంలో పవన్ కళ్యాణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు (ఆర్కే) తొలి ట్వీట్ పెట్టారు. శనివారం ప్రధానంగా టీవీ9 రవిప్రకాశ్ను టార్గెట్ చేసిన జనసేనాని.. ఆదివారం ఆర్కేపై ట్వీట్లు పెడతానని అభిప్రాయం వచ్చేలా చేశారు. 'గుడ్ మార్నింగ్ ఆర్కే!!' అని తొలి ట్వీట్ పెట్టారు.
బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదీసి కొడదాం
'ఆర్కే.. ప్లీక్ వెల్కమ్ టూ 'బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం' కార్యక్రమానికి మీకు స్వాగతం..' అని ట్వీట్ పెట్టారు. ఆర్కే ఫోటోలు కూడా పెట్టారు.
నువ్వు నడిపేది ఆంధ్రజ్యోతా.. టీడీపీ జ్యోతా?
మరో ట్వీట్లో 'బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం' షార్ట్గా చేసి బీఎంబీకే ప్రోగ్రామ్ విత్ పవన్ కళ్యాణ్.. ఈ రోజు మన అతిథి ఆర్కే అని పేర్కొన్నారు. టీడీపీ జ్యోతి నడుపుతున్నావా, ఆంధ్రజ్యోతి నడుపుతున్నావా అని దుమ్మెత్తిపోశారు. నీ పేపర్ ఆంధ్రులకు సంబంధించినది అయితే కాదని, అందుకు కొద్ది వారాల్లో ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.
టీవీ9 రవిప్రకాశ్ను చెప్పుతో కొట్టిన పిక్చర్
టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ పైన చెప్పుతో దాడి జరిగిందని, ఇది తమ గ్రౌండ్ స్టాఫ్ నుంచి ఫ్రెష్ అప్ డేట్ అని పవన్ పేర్కొన్నారు. అందులో రవిప్రకాశ్ పైన చెప్పుతో దాడి అని, కొట్టింది ఆ ఛానల్ మాజీ విలేకరి అని ఉంది. ఈ మేరకు గతంలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ను పెట్టారు.
తనపై మీడియా ప్రచారంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
తనపై కొన్ని మీడియా సంస్థలు కక్షపూరితంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని పవన్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఇంతకాలం సహనంగా ఉన్నామని, ఇన్ని రోజులు ఇష్టానుసారం వ్యవహరించినా మౌనంగా భరించామని, సహనానికి కూడా హద్దు ఉంటుందని, వారు చేయాల్సిన తప్పులన్నీ చేశారని, ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేయొద్దు అంటున్నారని, మీడియా సంస్థలపై తాను ఆరోపణలు చేస్తున్నాననడం హస్యాస్పదంగా ఉందని, లేనిపోని ఆరోపణలు చేస్తే బాధ కలగదా అని ప్రశ్నించారు. ఎవరో ఏదో అన్నారని అభిమానులు ఆవేశపడవద్దని, శాంతంగా ఉండి తనకు తోడ్పాటు అందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. సమయం వచ్చినప్పుడు తాను చెప్పినప్పుడు కలిసి రావాలన్నారు.
అభ్యంతరాలు ఉంటే మాకు ఫిర్యాదు చేయండి
కాగా, రెండు రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ వద్ద పవన్ మూడు గంటల పాటు ఉన్న సమయంలో అభిమానులు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (టీఎన్బీఏ) స్పందించింది. మీడియాపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించింది. మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించినట్లు టీఎన్బీఏ ప్రతినిధులు పేర్కొన్నారు. ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్నారు. ఛానళ్లలో ప్రసారమయ్యే వార్తలపై అభ్యంతరాలుంటే జూబ్లీహిల్స్లోని తమ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు.
పవన్ కళ్యాణ్ అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారు
ఫిలిం ఛాంబర్ వద్ద మీడియా ప్రతినిధులు, వారి వాహనాలపై దాడి ఘటనకు సంబంధించి పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సినీనటి శ్రీరెడ్డి అంశంలో మీడియాపై పవన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి ఖైరతాబాద్ కూడలి వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రజాజీవితంలో విమర్శలు సహజమేనని, సమాధానం చెప్పడం నాయకుల బాధ్యత అన్నారు. పవన్ అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా సంస్థలే లక్ష్యంగా భౌతికదాడులు, ఆస్తుల విధ్వంసం వంటివి సమంజసం కాదన్నారు.
పవన్, అనుచరులపై మోసం కేసు నమోదు చేయాలి
పవన్ కళ్యాణ్, ఆయన అనుచరులపై మోసం సహా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధి గుండెల్లి రాజేష్ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ తన ట్విటర్ ఖాతాలో మీడియా సంస్థలు ప్రసారం చేయని వీడియోలు పోస్ట్ చేయడం, అభ్యంతరకర పదాలతో వ్యాఖ్యలు చేయడం ద్వారా జర్నలిస్టులు, ముఖ్యంగా పలు మీడియా సంస్థలు, వాటి యజమానుల ప్రతిష్ఠకు భంగం కల్గించారన్నారు.
పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలి
అభిమానులను రెచ్చగొట్టి, మీడియాపై దాడికి పురిగొల్పిన పవన్ కళ్యామ్ పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డిమాండ్ చేశారు. ఒక వీడియోను మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని, పవన్ ప్రచారం అసత్యమని తేలిపోయిందన్నారు. నటి శ్రీరెడ్డి వాడిన అసభ్య పదాలను చానళ్లు బీఫ్ సౌండుతో ప్రసారం చేశాయన్నారు. మీడియా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోమన్నారు.