రూ.1.25 కోట్లు ఇచ్చిన నాగబాబు, వరుణ్ తేజ్, తిరిగి వచ్చాక కలుస్తానని పవన్ కళ్యాణ్
అమరావతి: తన సోదరుడు నాగబాబు, ఆయన తనయుడు, నటుడు వరుణ్ తేజ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి వారు విరాళం ఇచ్చారు. దీంతో జనసేనాని వారికి థ్యాంక్స్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ... జనసేన పార్టీకి విరాళంగా రూ.1 కోటి ఇచ్చినందుకు వరుణ్ తేజ్కు, రూ.25 లక్షలు ఇచ్చినందుకు నా సోదరుడు నాగబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఇది తమ పార్టీకి బహుమతి అని పేర్కొన్నారు. జనసేన పార్టీ మీద అభిమానంతోను, ఈ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు, హీరో వరుణ్ తేజ్లు పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
నేను తిరిగి వచ్చాక కలుస్తాను
నాగబాబు, వరుణ్ తేజ్లు ఎందుకోసమైతే ఈ విరాళం ఇచ్చారో దాని కోసం ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను తిరిగి వచ్చిన తర్వాత కృతజ్ఞతా పూర్వకంగా మిమ్మల్ని కలుస్తానని చెప్పారు.
గతంలో అంజనాదేవి విరాళం
కాగా, అంతకుముందు, పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి కూడా జనసేన పార్టీ కార్యాలయం కోసం రూ.4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆమె చెక్కును అందించారు. గతంలో పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అంటువంటి వారి కుటుంబాలకు అండగా నిలవాలని తన కుమారుడు పవన్ కళ్యాణ్ను అడిగానని, ఎందుకంటే పోలీస్ ఉద్యోగం తనకు బాగా తెలుసునని, తన తాతగారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారని, తన తండ్రి ఎక్సైజ్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసేవారిని గుర్తు చేసుకున్నారు.
గతంలో చిన్నారి విరాళం
జనసేన మీద అభిమానంతో పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయగూడెం గ్రామానికి చెందిన సాయి తేజస్వి అనే 12 ఏళ్ల విద్యార్థిని తాను దాచుకున్న 1,300/- పవన్ కళ్యాణ్కు పార్టీ విరాళంగా అందించారు. విద్యార్థిని సామాజిక స్పృహకు ముగ్దుడైన పవన్ అందులో నుంచి కేవలం రూ.11 స్వీకరించి మిగతా నగదు విద్యార్థినికి తిరిగి ఇచ్చి ఆశీర్వదించారు.