నేడు అమరావతికి జనసేనాని పవన్ కళ్యాణ్ .. పార్టీ కోర్ కమిటీ కీలక భేటీ
ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన జనసేన పార్టీ ఏపీలో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే పలు మార్లు సమీక్ష నిర్వహించింది. ఇక ఏపీలో పవన్ కళ్యాన్ భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓటమి చెందటంతో పార్టీ ఇక కనుమరుగవుతుందని ప్రచారం జరిగింది. కానీ పవన్ రాజాకీయాల్లోనే ఉంటానని , రాజకీయాల్లో తాడోపేడో తేల్చుకుంటానని ప్రకటించారు. ఇక ఈ నేపధ్యంలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యాలని ఎవరూ అధైర్య పడొద్దని జనసేనకు పడిన ఓటు బ్యాంకు నిజాయితీగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వేసిన ఓటు బ్యాంకు అని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
2024లో జనసేన సత్తా చూస్తారు అంటున్న మెగా బ్రదర్ నాగబాబు .. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఈ నేపధ్యంలోనే మరోమారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలోని అమరావతిలో పర్యటించనున్నారు. సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంపై జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి అమరావతికి చేరుకుని జనసేన కోర్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఇటీవల జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా మరోసారి పార్టీ నాయకులతో విడివిడిగా భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్ . ఇక పార్టీ నుండి వెళ్తున్న నాయకుల గురించి కూడా కోర్ కమిటీలో ప్రధాన చర్చ జరగనుంది. త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయమై కూడా జనసేనాని చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇటీవల జనసేన నేత ఆకుల సత్యనారాయణ సహా పలువురు నేతలు పార్టీపై విమర్శలు గుప్పిస్తుండటంతో దీనిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించే అవకాశముందని భావిస్తున్నారు.