తూర్పుగోదావరిలో పవన్ టూర్పై ఉత్కంఠ-దివీస్ బాధితులకు మద్దతుగా బహిరంగసభ
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి. ఫార్మా యూనిట్ల ఏర్పాటు కోసం జోరుగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో స్ధానికుల ఆందోళనలు పెరిగాయి. దీంతో స్ధానికంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు ప్రకటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ తూర్పుగోదావరి వెళ్లనున్నారు.
తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్ పరిశ్రమ వల్ల బాధితులయ్యే వారిని పవన్ ఇవాళ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గటంలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. దివీస్ పరిశ్రమను ఎట్టి పరిస్ధితుల్లోనూ అక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న స్ధానికులతో పవన్ సమావేశం కానున్నారు. దివీస్ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని పవన్ ఇక్కడ ప్రస్తావించనున్నారు. దీంతో పవన్ టూర్ ఆసక్తి రేపుతోంది.
పవన్ కొత్త పాకల పర్యటనకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు. చివరికి అనుమతి ఇచ్చారు. ముందుగా జనసేన నేతలు పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు. అనంతరం ఎస్పీ అసీమ్ హష్మీ సెలవుపై వెళ్తున్నట్లు తెలిపారు. జనసేన నేతల విమర్శలతో తిరిగి రాత్రికే పవన్ సభకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో పవన్ ఇవాళ కొత్త పాకల పర్యటనలో పోలీసులు ఎలాంటి వైఖరి అనుసరించబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
దివీస్ పరిశ్రమ ఏర్పాటుపై నెలకొన్న ఆందోళనల పరిష్కారానికి ప్రభుత్వం తాజాగా పరిశ్రమల శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని దివీస్ యాజమాన్యానికి సైతం ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి మొదటి వారంలోగా సమస్య పరిష్కారం కావాలని డెడ్లైన్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ అధికారులు దివీస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయినా కాలుష్య కారకమైన ఈ పరిశ్రమను పూర్తిగా తరలించాల్సిందేనని స్ధానికులు పట్టుబడుతున్నారు.