9న పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన: దివిస్ బాధితులకు పరామర్శ
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 9న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా సంస్థ తమ జీవితాలపై దుష్ప్రభావం చూపుతుందంటూ ఆందోళన చేపడుతున్న స్థానికులకు మద్దతు పలికేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.
9వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు తుని చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి దివిస్ పరిశ్రమ కాలుష్యంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ప్రభావానికి లోనయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, ఇటీవల లాఠీఛార్జీలో గాయపడినవారిని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు వివరాలను సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.
జనవరి 5న పవన్ కళ్యాణ్.. రామతీర్థ ధర్మ యాత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై ఒక పరంపరగా సాగుతున్న దాడులకు పరాకాష్ట రామతీర్థం క్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామి విగ్రహం శిరస్సును నరికివేయడం. ఈ దుస్సంఘటన తరువాత కూడా వరుస ఘటనలు చోటుచేసుకొంటున్నాయని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ ఘటనలను ఖండిస్తున్నాయి. ఇరు పార్టీలు ఈ నెల 5వ తేదీన రామతీర్థ ధర్మ యాత్ర చేపట్టాలని నిర్ణయించాయి. 5 వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన నాయకులు, శ్రేణులు బీజేపీ నేతలతో యాత్రగా తరలి వెళ్ళి ఆలయాన్ని సందర్శిస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థంలో బాధాకరమైన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత ఉదాసీనంగా ఉందన్నారు.
ఎంతో సున్నితమైన ఈ విషయంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. దేవాదాయ శాఖ, ఆ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో వున్నట్టా? లేనట్టా? అంతుబట్టడం లేదు. ఏ ఒక్క మంత్రి బాధ్యతతో వ్యవహరించడం లేదు. అందరూ కలసికట్టుగా వినోదం చూస్తున్నారు.
పోలీస్, దేవాదాయ శాఖలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. బాధ్యత కలిగిన మంత్రులు ఆలయాలపై జరుగుతున్న దాడులపై చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనకు ముందు నుంచి పలు ఆలయాల్లో విగ్రహాలను పగలగొట్టారు... రథాలను దగ్ధం చేశారు. ఈ దాడులపై ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబించకపోవడాన్ని నిరసిస్తూ రామతీర్థ ధర్మ యాత్రను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.