రాజధాని అమరావతి గ్రామాల పర్యటనకు పవన్ కళ్యాణ్..షెడ్యూల్ సిద్ధం చేస్తున్న జనసేన
ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజధాని అమరావతి కోసం పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. సుమారు రెండు రోజులపాటు ఈ పర్యటన సాగనున్నట్టు తెలుస్తుంది . పర్యటనలో ఏఏ గ్రామాలను సందర్శించాలో నిర్ణయించాలని,షెడ్యూల్ రూపొందించాలని స్థానిక జనసేన నాయకులను పవన్ ఆదేశించారు.
అదే నా భవిష్యత్ కార్యాచరణ.. జనసేన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన..
తాజాగా పవన్ పర్యటన షెడ్యూల్ కోసం భేటీ అయిన జనసేన , బీజేపీ నాయకులు
తాజాగా గుంటూరు, విజయవాడకు చెందిన బీజేపీ, జనసేన ఇరు పార్టీల నేతలు హాయ్ల్యాండ్లో భేటీ అయ్యారు. రాజధాని అమరావతి కోసం కలిసి ఒకేమాట మీద ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో ఇరు పార్టీలు నేతలు ఏది మాట్లాడినా ఒకే స్టాండ్ పాటించాలని నిర్ణయించారు. రాజధాని అనేది ఒక్కటే ఉండాలని, ఇక రాజధాని అమరావతిలోనే అక్కడే సచివాలయం, రాజ్భవన్, ఇతర కార్యాలయాలు ఉండాలన్నదే ఇరు పార్టీల విధానమని నిర్ణయించారు ఇరు పార్టీల నేతలు.
అమరావతి గ్రామాలను పర్యటించనున్న పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రాజధాని రైతులు ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి వారి గోడు విన్నవించిన విషయం తెలిసిందే . వారికి రాజధానిగా అమరావతినే ఉంటుందని అందుకోసం తన పోరాటం సాగుతుందని హామీ ఇచ్చారు పవన్ . ఇక అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. దీంతో మరోసారి రాజధానిలో పర్యటించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ సిద్ధం చేస్తున్న జనసేన .. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో భేటీ కానున్న పవన్
దీంతో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు.అదేవిధంగా ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో పవన్ భేటీ కానున్నారు. రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు విషయం కోర్టు పరిధిలో ఉన్నా, ప్రభుత్వం మాత్రం కొన్ని విభాగాలను తరలిస్తుంది. తాజాగా కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది . ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుండి పనిచేయనున్నాయి. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యటం , విశాఖ నుండి పాలన చెయ్యాలనుకోవటం వంటి అంశాలు కూడా పవన్ తో నేతల భేటీలో ప్రస్తావనకు రానున్నట్టు తెలుస్తుంది.