పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన: జనసేనతో పాటు బీజేపీ కలిసి సాగుతుందా?
ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజధాని అమరావతి కోసం పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఊహించని విధంగా ఏపీ రాజధాని విషయంలో కేంద్రం చేసిన ప్రకటన జనసేన , బీజేపీల మధ్య మైత్రీ బంధానికి ఆదిలోనే హంసపాదు అన్న చందంగా తయారైందా అన్న భావన జనసేన వర్గాల్లో కలుగుతుంది.
ఫిబ్రవరి 10 తర్వాత అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10 తర్వాత అమరావతి గ్రామాల్లో పర్యటించేందుకు నిర్ణయం తీసుకోవటం, జాతీయ స్థాయిలో తెలిసేలా అమరావతి పోరాటం సాగించనుండటం అటు రాజకీయ వర్గాల్లోనూ , ఇటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఈ పర్యటనలో బీజేపీ కూడా భాగస్వామ్యం తీసుకుంటుందా అన్నది అన్నిటికంటే ముఖ్యమైన అంశం.
దేశం నలుమూలలా తెలిసేలా అమరావతి పోరాటం చేస్తానన్న పవన్
రాజధాని రైతుల అమరావతి పోరాటాన్ని దేశం నలుమూలలా తెలిసేలా చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల పదో తేదీ తర్వాత తాను స్వయంగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజధాని రైతుల ఉద్యమస్ఫూర్తి చూసి తెలుగు వారంతా గర్విస్తున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చి ఇప్పుడు రోడ్డున పడ్డ రైతన్నలకు అండగా ఉంటానని ప్రెస్నోట్ విడుదల చేసింది.
పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసే ఈ పర్యటన కొనసాగిస్తారా అన్నదే సందిగ్ధం
ఇక ఈ నేపధ్యంలో అమరావతి ప్రయత్నం చెయ్యనున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసే ఈ పర్యటన కొనసాగిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత రాజధాని అమరావతి కోసం కేంద్రం మద్దతు తీసుకుంటానని అనుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఊహించని విధంగా బీజేపీ రాజధాని విషయంలో డిప్లమాటిక్ గా వ్యవహరించటంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజధాని కోసం బీజేపీతో కలిసి పోరాటం చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.
సొంత పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకున్న పవన్?
అమరావతి కోసం ఉమ్మడి పోరాటం చేస్తామంటూ నిన్నామొన్నటి దాకా ప్రకటించిన జనసేన, బీజేపీ నేతలు ప్రస్తుతం తాజా పరిణామాలతో ఆలోచనలో పడ్డారు . అటు బీజేపీ రాష్ట్ర నాయకులకు సైతం ఏమీ పాలుపోని స్థితి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రాజధానిగా అమరావతినే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నా కేంద్రంలోని అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వ నిర్ణయానికి అనుకూల ప్రకటన చెయ్యలేదు . పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ విషయంలో కాస్త నిరాశతో ఉండి ఇప్పుడు సొంత పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారని సమాచారం .
ఆదిలోనే దోస్తానా కట్ అవుతుందా ? బీజేపీ జనసేనలు కలిసి సాగుతాయా?
ఇక ఫిబ్రవరి పదో తేదీ తర్వాత తన పర్యటన విషయంలో పవన్ బీజేపీతో సంప్రదింపులు జరపలేదని తెలుస్తుంది . అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే రాజధాని అమరావతి కోసం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజా పరిణామాల నేపధ్యంలో అమరావతి పర్యటన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పర్యటనలో బీజేపీ కూడా జతగా సాగుతుందా ? లేకా మొదట్లోనే దోస్తానా కట్ అవుతుందా అనేది వేచి చూడాలి .