నువ్వు గుండెల్లో ఉన్నావ్: పవన్ ఆసక్తికరం, బాబుకు వార్నింగ్, ఆధారాల్లేవని సుజయ కృష్ణ కౌంటర్
విజయనగరం: పార్వతీపురంలో జనసేన పోరాట యాత్రలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. పార్వతీపురంలో కవాతు సందర్భంగా జనసేనాని మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమానిపై ఆయన దృష్టి పడింది. ఆ అభిమాని చొక్కా విప్పి, అదే పనిగా చేత్తో ఊపుతుండటాన్ని గమనించారు.
'సమస్యల'తో పెంచి పోషించి: పవన్ వ్యూహంలో టీడీపీ విలవిల, ఆ ఆయుధం పేలలేదా?
ఆ యువకుడి చాతిపై తన పచ్చబొట్టు ఉండటాన్ని గమనించారు. అది పచ్చబొట్టా.. గుండెల్లో ఉన్నావు.. గుండెల్లోకి వచ్చావు, అది చాలని పవన్ అన్నారు. అంతేకాదు, ఆ యువకుడి వైపు కెమెరాలు తిరిగాయి. తనపై పవన్ దృష్టి పడటంతో ఆ యువకుడు ఆనందపడ్డారు.
అదే తప్పు చంద్రబాబు మళ్లీ చేస్తున్నారు
ఏపీ సీఎం చంద్రబాబు గతంలో హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, ఇప్పుడు అమరావతి విషయంలోను అదే తప్పు చేస్తున్నారని పవన్ తన కవాతు సందర్భంగా అన్నారు. ఉత్తరాంధ్రకు ఫిలిం స్టూడియో రావాల్సి ఉందని, దాని కోసం కృషి చేస్తానని చెప్పారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, పందిళ్లు వేసుకొని కూర్చుంటున్నారన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. 90 శాతం గిరిజనులు ఉన్న కురుపాంలోని సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని, టీడీపీ సామాన్యులను, గిరిజనులను నిర్లక్ష్యం చేసిందన్నారు.
రాజు అంటే రక్షించాలి కానీ
రాజు అంటే ప్రజలను రక్షించాలని, సమస్యలు పరిష్కరించాలని, కానీ పార్వతీపురం, బొబ్బిలి నాయకులు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. తోటపల్లి, జంఝావతి పూర్తికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, కానీ హెరిటేజ్ పాట ఉద్యోగికి రూ.500 కోట్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆస్తులు పెంచుకోడానికే అధిక ప్రాధాన్యతలు ఇస్తున్నారన్నారు. శ్రీకాకుళంలో ఉద్దానం సమస్య జనసేన వల్లనే బాహ్య ప్రపంచానికి తెలిసిందని, లేకుంటే ఇప్పటికి అక్కడి నాయకులు బయటకు రానివ్వరన్నారు. ఉత్తరాంధ్రకు జనసేన అండగా ఉంటుందని, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
బాబు పట్టించుకోకుంటే రాష్ట్రం మూడు ముక్కలవుతుంది
అమరావతి, విజయవాడ, గుంటూరులోనే అభివృద్ధి చేస్తే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలుతుందని, ఇతర ప్రాంతాలను చంద్రబాబు పట్టించుకోకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలవుతుందని పవన్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశముందని, ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వస్తోందన్నారు. చంద్రబాబు ముందే మేల్కొంటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదన్నారు. హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ అంటూ బీజేపీ నేతలకు సన్మానం చేశారన్నారు. ఇప్పుడు ఇతరులను విమర్శిస్తున్నారన్నారు.
చంద్రబాబు, లోకేష్ తిరిగేచోట రోడ్లు
ప్రజలు అన్నీ గమనిస్తున్నాని, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని పవన్ అన్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమని, ఇప్పుడు కళింగాంధ్ర ఉద్యమం వచ్చేలా చేస్తున్నారన్నారు. సింగపూర్ కాదని, ముందు వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే చాలదన్నారు. చంద్రబాబు, లోకేష్ తిరిగే చోట రోడ్లు వేయిస్తున్నారని, ఏమైనా అంటే మేమే రోడ్లు వేశామంటారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో ప్రజలు ఉండే చోట రోడ్లు వేయాలన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనేది చంద్రబాబు, ఆ తర్వాత దాని కోసం దీక్షలు అని డ్రామాలు ఆడేది చంద్రబాబే అన్నారు. కురుపాంలో గిరిజన వర్సిటీ పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలను కొనడం పైనే ఆసక్తి
గిరిజన శాఖకు గిరిజనేతరులు మంత్రిగా ఉండటం ఏమిటని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రతిపక్షంలోని వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, లాక్కోవడం పైనే ఆసక్తి అని, ప్రజా సమస్యలు తీర్చడంపై లేదన్నారు. ప్రత్యామ్నాయం కోసంమే జనసేన వచ్చిందని, సమస్య ఉన్న ప్రతిచోట జనసేన ఉంటుందన్నారు. పూర్ణపాడులో వంతెన నిర్మించపోతే టీడీపీ నాయకుడిని తిరగనిచ్చేది లేదన్నారు. అదిలాబాద్ జిల్లా వెళ్లినప్పుడు మూడు గ్రామాలకు ఒకే ఒక బోరు ఉందని, తన వద్దకు ఓ ముసలామె వచ్చి మా గిరిజన గ్రామాల్లో ఏమి లేవని వాపోయారని, మీరు ఏం చేసినా చేయకపోయినా మాకు తాగడానికి నీళ్లు ఇస్తే చాలని ఆమె చెప్పిందని, ఆ తర్వాత మరోసారి వెళ్లానని, తన ముందు మినరల్ వాటర్ బాటిల్ పెట్టారని, అప్పుడు వృద్ధురాలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కొంత డబ్బు ఇచ్చి బోరు తవ్వించమని చెప్పానని పవన్ గుర్తు చేసుకున్నారు.
పవన్కు సుజయ కౌంటర్
కాగా, అంతకుముందు తన యాత్రలో పవన్ చేసిన ఇసుక మాఫియా యాత్రపై మంత్రి సుజయ కృష్ణ రంగారావు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాలో ఉన్నారన్న పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు క్వారీలు లేవని, పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. ఆరోపణలు నిరూపించగలరా అని సవాల్ విసిరారు.