ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తోన్న పవన్ కల్యాణ్: వైరస్ జీవితకాలంపై కామెంట్స్: షాక్ ఇచ్చిన ట్విట్టర్..!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది ప్రపంచం. వేలాదిమంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. లక్షలాది మంది ఈ మహమ్మారి పాలిట పడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో కొత్తగా నమోదవుతున్నాయి. భారత్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 మార్క్ను అధిగమించింది. ఆందోళనకరంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కఠిన చర్యలను తీసుకుంటున్నాయి.
విజయవాడ, రాజమండ్రి విద్యార్థులకు పాజిటివ్: థర్మల్ స్క్రీనింగ్ను తప్పించుకోవడానికి చావు తెలివితేటలు.
కరోనాపై తప్పుడు సమాచారం..
ఇలాంటి ఉద్రిక్త వాతావరణం, భయాందోళన కలిగిస్తోన్న పరిస్థితుల మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ఫేక్ న్యూస్ను ప్రచారం చేశారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో పవన్ కల్యాణ్ ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ను పోస్ట్ చేయగా.. ట్విట్టర్ మేనేజ్మెంట్ దాన్ని వెంటనే తొలగించింది. ఆయన పోస్ట్ చేసిన ఈ సమాచారం..ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఆ సమాచారాన్ని తొలగించినట్లు స్పష్టం చేసింది.
వైరస్ జీవిత కాలంపై పవన్ కల్యాణ్
కరోనా వైరస్ ఇనుము లేదా లోహ సంబంధ వస్తువులపై 12 గంటల పాటు మాత్రమే నివసిస్తుందనే సమాచారాన్ని పవన్ కల్యాణ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దుస్తులపై తొమ్మిది గంటలు, చేతులపై 10 నిమిషాలు పాటు మాత్రమే అది నివసించగలుగుతుందనే విషయాన్ని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని షేర్ చేశారు. కామెంట్స్ రాశారు.
నిబంధనల ఉల్లంఘటన అంటూ..
ఈ సమాచారం మొత్తం తప్పు అని తేలింది. ట్విట్టర్ నిబంధనలకు వ్యతిరేకించినట్లు ఉండటంతో ఈ ట్వీట్ను తొలగించినట్లు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఇదే తరహా సమాచారాన్న దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో దాన్ని కూడా ట్విట్టర్ యాజమాన్యం డిలేట్ చేసింది. కరోనా వైరస్పై రజినీకాంత్ రెండు వీడియోలను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదంతా తప్పుడు సమాచారం కావడం వల్ల ఆ వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది.
రజినీ వీడియోలూ తొలగింపు..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య కరోనా వైరస్కు సంబంధించిన ఎలాంటి తప్పుడు సమాచారాన్ని గానీ, ప్రజలను తప్పు దారి పట్టించే ఎలాంటి విషయాన్ని గానీ తాము ప్రమోట్ చేయలేమని ట్విట్టర్ యాజమాన్యం పేర్కొంది. కాగా.. రజినీకాంత్ ట్విట్ చేసిన సమాచారం సరైనది కాదంటూ తేలిపోవడంతో.. నెటిజన్లు చెలరేగిపోతున్నారు. బాధ్యత గల వ్యక్తులు చేయాల్సిన పని ఇది కాదంటూ హితబోధ చేస్తున్నారు.