శ్రీకాకుళం దాటేలోపు కీలక నిర్ణయం తీసుకుంటా, 48 గంటల సమయం ఇస్తున్నా: బాబుకు పవన్ అల్టిమేటం
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రూ.లక్షల కోట్ల డబ్బున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా కనిపించినా ఇప్పటికీ సమస్య పరిష్కారం ఎందుకు కాలేదన్నారు.
Recommended Video
రీసెర్చ్ సెంటర్ పెట్టాలని అమెరికా డాక్టర్లు చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, అనుసంధానం లేదన్నారు. ఇక్కడ బ్లడ్ బ్యాంకు కావాలన్నారు. ఆరోగ్యసమస్యలు చెప్పాడానికి మంత్రి లేకపోవడం దారుణం అన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే ఆరోగ్య శాఖకు మంత్రిని కేటాయించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక అధికార యంత్రాంగం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో చంద్రబాబు సమస్యను పరిష్కరించాలన్నారు.
రాత్రిపూట పవన్ కళ్యాణ్ బస చేసిన కళ్యాణ మండపం వద్ద హంగామా
చంద్రబాబు ఇప్పటికైనా దిగొచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను తన జనసేన పోరాట యాత్రను నిలిపివేసి ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
తనకు అధికారం లేకున్నా సమస్యలపై స్పందిస్తున్నానని అధికారంలో ఉన్నవారు స్పందించకుంటే ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని నిలదీశారు. రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. మంత్రిని నియమించకపోతే ఉద్యమాలు తప్పవన్నారు. హెల్త్ సెక్రటరీ ఈ విషయమై స్పందించి మాట్లాడాలన్నారు. శ్రీకాకుళం జిల్లాను తాను దాటేలోపే కీలక నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.
డీజీపీని కలిసిన జనసేన నేతలు
ఉత్తరాంధ్రలో యాత్ర చేస్తున్న పవన్కు భద్రత కల్పించాలని జనసేన పార్టీ నేతలు ఏపీ డీజీపీ మాలకొండయ్యను కోరారు. మంగళగిరిలో పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలిసి, ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పవన్ యాత్ర, బస చేసే ప్రాంతాల్లో కనీసం 30 మంది పోలీసులతో భద్రత కల్పించాలన్నారు. పవన్కు భద్రత కల్పిస్తున్న పోలీసులు సివిల్ డ్రెస్ ధరిస్తున్నారని, దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతోందని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. పవన్కు కేటాయించే పోలీసులు యూనిఫామ్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. ఆయా జిల్లాల ఎస్పీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.