సీఎం జగన్ కు పవన్ అల్టిమేటం : భయపడి నా వద్దకు వచ్చి..కోర్టుకు వెళ్తూ పాలిస్తారా: జనసేనాని ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్..రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డితో పాటుగా మంత్రుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇసుక సమస్య పరిష్కారానికి జగన్ ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నట్లు అల్టిమేటం జారీ చేసారు. ఆ లోగా భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలని..మరణించిన వారికీ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. లేకుంటా అమరావతిలో నడుస్తానని హెచ్చరించారు. ఇక, ప్రతీ వారం కోర్టుకు వెళ్లేవారికి పాలించే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
సూట్ కేసు కంపెనీలు పెట్టి జైలు కెళ్లిన ఈ నేతలు తనను విమర్శించటం పైన ఫైర్ అయ్యారు. పరిధి దాటి వ్యవహరిస్తే తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు. మంత్రి కన్నబాబును రాజకీయాల్లోకి తామే తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. తన అభిమానులు సైతం వైసీపీకి ఓటు వేసారని..తనను నమ్మలేదని వ్యాఖ్యానించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యను ప్రధానికి వివరించేందుకు ఢిల్లీకి తీసుకెళ్తామని స్పష్టం చేసారు.
జగన్ లాగా వేల కోట్లులేవు.. ఆ ధైర్యం వారికి లేదు
విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద మండి పడ్డారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నడిబొడ్డున నిలబడి మాట్లాడానని..వైసీపీ నేతలకు ఆ ధైర్యం లేదని చెప్పుకొచ్చారు. అధికారం..డబ్బులు కోసం అర్రులు చాచే వాడిని కాదని చెప్పారు. తనను టీడీపీ దత్తపుత్రుడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరత కారణంగా డెవలప్ మెంట్ ఆగిపోతోందని.. కార్మికుల ఆత్మహత్యలు కలిచి వేసాయని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ అద్బుత పాలన అందిస్తే తాను సినిమాలు చేసుకుంటానని చెప్పారు. వైసీపీ నేతలతో తిట్టించుకోవటం తనకు సరదా కాదని..తన కోపం వైసీపీ నేతలకు తెలియదని చెప్పుకొచ్చారు. తనకు అధికారం కావాలంటే ప్రజారాజ్యం నుండి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేవాడినని చెప్పారు. జగన్ లాగా కార్మికుల దగ్గర వేల కోట్లు లేవని..వైసీపీ ఎమ్మెల్యేల లాగా వందల కోట్లు లేవని చెప్పుకొచ్చారు.
సీఎం..మంత్రులు..సాయిరెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ పైన పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సూట్ కేసు కంపెనీలు పెట్టిన వారు..జైలు శిక్ష అనుభవించిన వారు..వారం వారం కోర్టుకు వెళ్లే వారికి పాలించే హక్కు ఉందా అని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబును తామే రాజకీయాల్లోకి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. తన ఓటమి గురించి మాట్లాడుతున్నారని..ఓడినా ప్రజల కోసమే ఉంటానని చెప్పారు. తాను ప్రజల దత్తపుత్రుడినని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ పాలసీలు సరిగ్గా లేనప్పుడు పాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. అజయ్ కల్లాం లాంటి వారు ఉన్నా.. వారి మాట వినటం లేదన్నారు. వైసీపీ వస్తేనే ఏపీలో వర్షాలు వచ్చాయా..ఇతర రాష్ట్రాల్లో వర్షాలు వస్తే ఇసుక సమస్య ఎందుకు లేదని నిలదీసారు. సూట్ కేసులు కంపెనీలు పెట్టే సాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడుగా ఎలా అయ్యారని ప్రశ్నించారు. తన డిఎన్ ఏ గురించి ప్రశ్నించే వైసీపీ నేతలు తన గురించి ఎందుకు వచ్చారని..టీడీపీతో విభేదించిన తరువాత భయంతో తన వద్దకు వచ్చారని చెప్పుకొచ్చారు. తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వాడిని కాదన్నారు. ఇటువంటి వారు పాలకులు అవ్వటం ప్రజల బ్యాడ్ లక్ అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో ఏకస్వామ్యం నడుస్తోంది..
వైసీపీ ప్రభుత్వంలో ఏకస్వామ్యం నడుస్తోంది..సలహాదారులు ఉన్నా వారి మాటకు విలువ లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెబుతన్నారని..అసలు అన్నీ పనులు నిలిపివేస్తే అవినీతి ఎక్కడా జరుగుతుందని..పనులు చేస్తే అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.బొత్సా సత్యనారాయణ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని..తన పైన విమర్శలు చేయవద్దని తన వద్దకు రాయబారం పంపారని గుర్తు చేసారు. అమెరికా వెళ్లినా తనకు సెక్యూరిటీ ఉంటుందని..విశాఖ వస్తే మాత్రం సెక్యూరిటీ తగ్గించేసారని వివరించారు. తన విషయంలో వైసీపీ నేతలు పరిధి దాటుతున్నారని..అటువంటి వారిని తాట తీసి కూర్చోబెడుతానని హెచ్చరించారు. వైసీపీ నేతల సత్తా ఎంత..వీరి స్థాయి ఎంత అని ప్రశ్నించారు.
15 రోజుల డెడ్ లైన్..
ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల విషయంలో ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ లోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిది నుండి పని కోల్పోయిన ప్రతీ కార్మికుడికి 50 వేలు ఇవ్వాలని..అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న వారికి 5 లక్షల చొప్పున ఇవ్వాలని పవన్ డిమాండ్ చేసారు. లేకుంటే తాను అమరావతితో దిగుతానని..పోలీసులను తెచ్చుకుంటారో..ఆర్మీతో అడ్డుకుంటారో చూద్దామని హెచ్చరించారు. కులాలతో రాజకీయాల చేస్తున్న వారి పైన అప్రమత్తంగా ఉండాలని..యువత నేటి తరం ప్రతినిధులుగా కులాలకు అతీతంగా ఉండాలని సూచించారు. దేశాన్ని నడిపిస్తున్న వారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..భవన నిర్మాణ కార్మికుల సమస్యను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని పవన్ ప్రకటించారు.