అన్యాయం..దొంగ:ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్ కళ్యాణ్,విజయ్ సాయిరెడ్డిల ఆగ్రహం...
చిత్తూరు:సొంత జిల్లా ప్రజలకే న్యాయం చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగిలిన జిల్లా ప్రజలకు ఏం న్యాయం చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అని పవన్ నిలదీశారు. శ్రీ్కాళహస్తి ఆలయం సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మరోవైపు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసిపి నేత విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు చాలాకోపంగా ఉన్నారని చెప్పారు. తన సంఘీభావ యాత్రలో సమస్యలన్నింటిపై ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి, వైసిపి పార్టీ దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా భాగస్వామ్యులై, చేస్తున్న అక్రమాలు, అన్యాయాల పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లాలో...పర్యటన
చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నపవన్ కళ్యాణ్ మంగళవారం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శించుకున్నారు. ఆలయం తరపున ఈవో భ్రమరాంబ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని సర్వదర్శన క్యూలైన్లో వెళ్ళి జ్ఞాన ప్రసున్నాంబ సమేత శ్రీవాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్కు తీర్ధప్రసాదాలు అందజేశారు. పవన్ రాకతో అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కాబోయే సీఎం అంటూ ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. దీంతో ఆలయ ముఖద్వారం మూసివేసేందుకు ప్రయత్నించటంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆ తరువాత పవన్ గుడిమల్లం పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
చంద్రబాబుపై...విమర్శలు
చిత్తూరులోని హైరోడ్డు విస్తరణలో భవననాలను కోల్పోయిన బాధితుల పక్షాన అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన మంగళవారం బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని ప్రజలకు న్యాయం చేయలేదు కానీ మిగిలిన జిల్లా ప్రజలను ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పేద ప్రజలకు న్యాయం చేయాలని.. డబ్బున్న వ్యక్తికి ఓ న్యాయం...పేదోడికి మరో న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలు నుంచి వచ్చే వారికి వేల ఎకరాలు ఇస్తున్నారని, సొంత జిల్లా వాసులకు న్యాయం చేయలేరా అని ప్రశ్నించారు. నంద్యాల, విజయనగరం, శ్రీకాళహస్తిలో ఇచ్చిన నష్ట పరిహారం చిత్తూరులో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఆయన బాధితులతో కలసి దుర్గానగర్ నుంచి గాంధీ రోడ్ వరకు పాదయాత్ర చేపట్టారు.
వైసిపి...విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలు
ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా విజయ్ సాయిరెడడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ పట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల రూపాయిలు అవినీతికి పాల్పడ్డారు. అన్ని ప్రభుత్వ పనుల్లో, ప్రాజెక్టుల్లో ధనార్జనే ధ్యేయంగా సాగించిన ముఖ్యమంత్రి, నాలుగేళ్ళు బీజేపీతో జతకట్టారు.చంద్రబాబు ఒక దొంగ. మూడు లక్షల కోట్ల రూపాయిలు ప్రజాసొమ్మును దోచుకున్న వ్యక్తి, దొంగకాక ఏమవుతాడు. దొంగ ఎక్కడ దాక్కున్నా, దొంగ దొంగే. చట్టానికి లోబడి, చట్టపరిధిలోకి తీసుకువచ్చి శిక్షించాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాలకు తరలించిన మూడు లక్షల కోట్ల రూపాయలు, తిరిగి తీసుకువచ్చి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి. ఆ సొమ్ము తో అద్భుతమైన రాజధాని కట్టుకోవచ్చు.
విమర్శలు...బీజేపీతో పొత్తు లేదు
చంద్రబాబు ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు, ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి, స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు. ఇటువంటి వ్యక్తి, ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా, నేను బీజేపీతో పోరాడుతా, యుద్ధం చేస్తా, మీరంతా కలసి రండంటూ మభ్యపెట్టి, బీజేపీపై బురద జల్లుతూ, తన వైఫల్యాలను ఇతర పార్టీల మీద వేస్తున్నాడు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకుని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, వైఎస్సార్సీపీ బీజేపీ తో జతకట్టిందని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసిపితో జత కట్టమని బీజేపీ అధికారప్రతినిధే స్పష్టం చేశారు. వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు సైతం ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలిపారు. మా సిద్దాంతం ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వారితో కలిసి పనిచేస్తాం అని చెప్పామని విజయ్ సాయిరెడ్డి తెలిపారు.