పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో బెజవాడకు: వైసిపిపై కామినేని ఫైర్, మధ్యవర్తి బిజెపి నేత?
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ప్రభుత్వమే ప్రత్యేకంగా విజయవాడకు తీసుకు వచ్చిందనే ఆరోపణల పైన మంత్రి కామినేని శ్రీనివాస్ రావు శుక్రవారం నాడు ఖండించారు. పవన్ కళ్యాణ్ను ప్రభుత్వమే తీసుకు వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
దీనిపై మంత్రి కామినేని మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారని చెప్పారు. ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకే ఆయన వచ్చారని తెలిపారు. ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ను ప్రభుత్వం తీసుకు వచ్చిందనేది సరికాదన్నారు.
ప్రజా సమస్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే పవన్ కళ్యాణ్ మెరుగ్గా పోరాడుతున్నారని కితాబిచ్చారు. వచ్చేసారి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎద్దేవా చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల మధ్యవర్తిత్వం వెనుక కామినేని శ్రీనివాస్ రావు ఉన్నారనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో పవన్తో పాటు కామినేని ఉన్నారు. ఈ సమయంలో ఆయన పలు విషయాలు జనసేన అధినేతకు వివరించారని తెలుస్తోంది.
రాయలసీమకు సరైన న్యాయం జరగడం లేదు: రఘువీరా
రాయలసీమకు సరైన న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. 2015 కల్లా పూర్తి కావాల్సిన ప్రాజెక్టులపై అతీగతీ లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించడం లేదన్నారు. రూ.24,500 కోట్లు రావాల్సి ఉంటే, కేవలం రూ.350 కోట్ల విడుదల చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టంలోనే ఉందని చెప్పారు. రాయితీలు ఇస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు.