కొత్త ఇంటిని పరిశీలించిన పవన్ కళ్యాణ్, ఒక్కో మొక్క గురించి అడిగి తెలుసుకున్నారు
గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలో గురువారం పర్యటించారు. ఇందులో భాగంగా కాజ వద్ద నిర్మిస్తున్న తన ఇల్లు, కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
Recommended Video
తెలంగాణకు ఇచ్చి మాకివ్వరా, జగన్ దొరికిపోయారు!: మోడీపై బాబు, పవన్కు ప్రశ్న
కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీ కార్యాలయ ఆవరణలో నాటేందుకు అవసరమైన మొక్కలు కూడా అక్కడకు చేరుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి పలు మొక్కలను లారీలలో తీసుకు వచ్చారు. ఈ మొక్కలను పరిశీలించిన పవన్ కళ్యాణ్, వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ నవరాత్రి దీక్ష
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం పట్టిసీమలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దుర్గామాత దీక్షను చేపట్టారు. తొమ్మిది రోజులు దీక్ష చేస్తారు. ఈ దీక్ష సమయంలో ఆయన కేవలం పాలు, పండ్లు మాత్రమే స్వీకరిస్తారు.
ఆలయ చరిత్ర తెలుసుకున్న పవన్ కళ్యాణ్
పోలవరం మండలం పట్టిసీమలో అఖండ గోదావరి మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవాలయాన్ని పవన్ బుధవారం ఉదయం సందర్శించారు. ఆలయ పూజారులు.. జనసేనానికి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాన్ని అందించారు. ఆలయ చరిత్రను ధర్మకర్త వివరించారు.
కవాతుకు జనసేన పిలుపు
ఈ నెల అక్టోబర్ 15న వతేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో దవళేశ్వరం కాటన్ బ్రిడ్జి పైన భారీ కవాతు నిర్వహిస్తున్నారు. ఈ కవాతులో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. రాజకీయ జవాబుదారీతనంపై యువతను జాగృతం చేసేందుకు దవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు నిర్వహిస్తున్నామని, దీనికి ఉప్పెనలా తరలి రావాలని జనసేన పిలుపునిచ్చింది.
జనసేన ప్రార్థనలు
అక్టోబర్ 15న ధవళేశ్వరం బ్యారేజిపై జరిగే భారీ జనసేన కవాతుకు ఏ ఆటంకాలు కలగకుండా, అంతా క్షేమంగా జరగాలని జనసైనికులు అంతకుముందు రోజు అంటే 14వ తేదీన సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. అందరూ క్షేమంగా వచ్చి, తిరిగి వెళ్లాలని కోరుతూ ప్రార్థనలు చేస్తారు.