2019లో జగన్కు మద్దతిచ్చేందుకు పవన్ రెడీ, బాబుకు దూరం అందుకే: వరప్రసాద్ సంచలనం
హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని టీడీపీ నేతలు నవ్విన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్త చర్చ జరిగిందన్నారు.
శుక్రవారం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడమే రాజీనామాల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.
పదవులు పోయినా..
తాము ప్రజల కోసం పనిచేసే వాళ్లమని, టీడీపీ కామెంట్స్ పట్టించుకోమని మిథున్ రెడ్డి అన్నారు. వాళ్ల సర్టిఫికేట్ తమకు అవసరం లేదని అన్నారు. పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదు చేసినా మూడేళ్లుగా చర్యలు లేవని, తమ రాజీనామాల ఆమోద తాత్సరానికి టీడీపీ-బీజేపీతో లాలూచీకి నిదర్శనమని తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని చెప్పారు.
Recommended Video
అధికార టీడీపీ చేయలేని పనిని చేసి చూపించాం
నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేసి చూపించిందని ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని వారు అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జగన్ బాగా శ్రమిస్తున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతం, ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా బాగా శ్రమిస్తున్నారని అన్నారు.
పవన్ మద్దతు జగన్ పార్టీకే
అంతేగాక, జగన్మోహన్ రెడ్డికే తన మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు పవన్ ప్రయత్నం చేసిందని వాస్తవమేనని అన్నారు. చంద్రబాబు అవినీతి ఆయనకు నచ్చడం లేదని , అందుకే జగన్తో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారని చెప్పారు.
2019లో వైసీపీకి మద్దతిచ్చేందుకు పవన్ రెడీ
2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చానని.. అయితే టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదని పవన్ అన్నారని తెలిపారు. అనుభవజ్ఞుడని మద్దతిస్తే, ఈ నాలుగేళ్లలో ఆయన పాలన అవినతి పెరిగిపోయిందని, ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేదని పవన్ చెప్పారని వరప్రసాద్ తెలిపారు.