ప్రజలకు అన్యాయం చేస్తే...ప్రభుత్వంపై జనసేన తిరుగుబాటు చేస్తుంది:పవన్ కళ్యాణ్
చిత్తూరు:ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమాలను జన సేన పార్టీ వ్యతిరేకిస్తుందని, అలాంటి పనులు చేస్తే మీమీద తిరుగుబాటు చేస్తుందని ఎపి ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో ఐదు రోజులుగా పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ శెట్టిపల్లిలో రైతులతో మాట్లాడారు.
రైతులకు చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ మూడు చెంచాల తీర్థం పోసినట్లుగా ఉందని విమర్శించారు. లక్ష కోట్లు రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు రూ. 20 కోట్లే చేశారని అన్నారు. ఈలోగా రైతు రుణాలపై వడ్డీలు పెరిగిపోయాయని పవన్ విమర్శించారు. త్రికరణ శుద్ధితో అమలు చేయలేనపుడు హామీలు ఇవ్వడం దేనికని ఆయన ప్రశ్నించారు. రైతులకు న్యాయ జరిగేంత వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
శెట్టిపల్లి రైతుల...భూ సమస్య
చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో గ్రామంలో 1945లో ఎస్టేట్ అబాలిషన్ చట్టం ప్రకారం ఓ సర్వే నిర్వహించారు. అప్పట్లో భూములను తమ అధీనంలో ఉంచుకున్న ప్రజలు వాటి తాలూకు సరైన ధ్రువీకరణ పత్రాలు సర్వే అధికారులకు చూపించలేదు. దీంతో ఆ భూములపై హక్కుదారులెవరన్నది నాటి నుంచీ వివాదంగానే మిగిలిపోయింది. ఈ గ్రామంలో 640 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ భూమి 125 ఎకరాలు కాగా...సీఆర్ఎస్ కోసం సేకరించింది 90 ఎకరాలు. చెరువు పరిధిలో 54 ఎకరాలు, గ్రామ కంఠంగా మరో 12 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమిలో ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారనేది అధ్యయనం చేయనున్నారు. ఇప్పటిదాకా ఈ భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నా...రిజిస్ట్రేషన్లు మాత్రం కావడం లేదు. రిజిస్ట్రేషన్లపై నిషేధం అమలవుతోంది.
శెట్టిపల్లి రైతులకు...పవన్ కల్యాణ్ అండ
తిరుమల శ్రీవారి దర్శనంతో చిత్తూరు జిల్లా పర్యటన ప్రారంభించి ఐదు రోజులుగా అక్కడ పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం శెట్టిపల్లి రైతులతో మాట్లాడారు. టిడిపి గ్రామాల మధ్య వివక్ష చూపుతోందని, అందుకే శెట్టిపల్లికి అన్యాయం జరిగిందన్నారు. పైడిపల్లి గ్రామానికి న్యాయం చేసిన టిడిపి ప్రభుత్వం శెట్టిపల్లికి మాత్రం అన్యాయం చేశారన్నారు. కానీ శెట్టిపల్లి గ్రామం కూడా తెలుగుదేశం గ్రామమేనని, మీకు సపోర్ట్ చేసే గ్రామానికి కూడా న్యాయం చేయకపోతే ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం అవలంభిస్తున్నవిధానాల వల్ల ఓటు వేసిన వారే ఎదురుతిరుగుతున్నారని టిడిపి గుర్తించాలన్నారు.
దోచుకునే తెలివితేటలు..కాపాడేవి లేవా?
ప్రభుత్వానికి మానవతా దృక్పధం లేకపోతే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. వేల ఎకరాల భూములు దోచుకునే తెలివితేటలు మీకున్నప్పుడు 600 ఎకరాలు కాపాడే తెలివితేటలు ఎందుకు లేవని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిమ్మల్ని దోచుకోవడానికి వాళ్లకి హక్కులేదని, మిమ్మల్ని దోపిడీ చేయడానికి వాళ్లకి హక్కు లేదు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల బాగు కోసం జనసేన పార్టీ ముందుకు వచ్చిందన్నారు. అవసరానికి మించి రైతుల నుంచి భూములు తీసుకోవడాన్ని, శెట్టి పల్లి ప్రజల భూములు లాక్కోవడాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అలా చేస్తే మీమీద తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు.
గతంలో గెలిపించాం...పోరాటం చేస్తాం
గత ఎన్నికల్లో తాను టిడిపికి అండగా నిలిచాలని, టిడిపి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ప్రభుత్వానికి అండగా నిలిచింది రైతులకు మేలు చేస్తారని, ప్రజలకు అండగా నిలుస్తారని అని పవన్ వెల్లడించారు. ఇంతచేసినా ప్రభుత్వం నుంచి తాను ఎటువంటి లబ్ది ఆశించలేదన్నారు. తమకు అన్యాయం జరిగినా ఎలాగోలా పరిష్కరించుకోగలమని, కానీ ప్రజలకు అన్యాయం జరగడాన్ని చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే మీకు బుద్ది చెప్పేందుకు తప్పుకుండా పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.