పోలీస్ కొడుకు సీఎం కాలేడా, గోదావరికి తెస్తే తంతాం: జగన్-బాబులకు పవన్ వార్నింగ్, లక్షకోట్లపై..
ధవళేశ్వరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభిమానులు సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నాకు సీఎం పదవి అలంకారం కాదన్నారు.
చంద్రబాబు, లోకేష్లపై దుమ్మెత్తిపోసిన పవన్ కళ్యాణ్
అలాగే లోకేష్, వైసీపీ అధినేత వైయస్ జగన్లా తనకు వారసత్వం కాదని చెప్పారు. మీ మాట విశ్వంలోకి వెళ్తుందని, అది సత్యం అవుతుందన్నారు. తాను పార్టీని సమాజ ప్రయోజనాల కోసం పెట్టానని చెప్పారు. తాను ఏ పని చేసినా త్రికరణశుద్ధితో చేస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు.
ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం ఎందుకు కాలేడా
ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. బలం, శక్తి, పోరాటం చేయగలికే సత్తా, భావజాలం ఉందని చెప్పారు. నేను పార్టీ పెట్టింది స్వప్రయోజనాల కోసం కాదని, ప్రజల కోసం, దేశ ప్రయోజనాల కోసం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా చెప్పారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ఉద్యోగులకు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా వారికి అండగా ఉంటానని చెప్పారు.
మా అమ్మను తిట్టిస్తారా, చేయని తప్పుకు అవమానాలు
2014లో నేను మీకు మద్దతు ఇస్తే మీరు (చంద్రబాబు) నన్ను, మా అమ్మను తిట్టిస్తారా అని తెలుగుదేశం పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మమ్మల్ని తిట్టినా భరిస్తామని, సహిస్తామని, ఎక్కువ చేస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరించారు. చేయని తప్పుకు అవమానాలు భరించానని, ప్రజల కోసం భరించానని చెప్పారు. తనకు తెలంగాణ తెలుసు, ఉత్తరాంధ్ర తెలుసు, నెల్లూరు తెలుసు, ప్రకాశం తెలుసు, కడప తెలుసునని, తూర్పు గోదావరి జిల్లాలో ఆదరించే ప్రజలు ఉన్నారని అన్నారు. ఇక్కడ అన్ని సీట్లు జనసేన గెలుచుకోవాలన్నారు.
పంచాయతీ ఎన్నికలు పెట్టకుంటే, హెచ్చరిక
వ్యవస్థలో మార్పు రావాలంటే మూలాల నుంచి మార్పు ప్రారంభం కావాలని పవన్ చెప్పారు. టీడీపీ పంచాయతీ ఎన్నికలు పెడితే మా సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. సమయం అయిపోయినా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో జనసేన పార్టీ భవన నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. పాలనా వ్యవస్థ దారుణంగా తయారయిందన్నారు. వ్యవస్థలను చంద్రబాబు నిర్జీవం చేస్తుంటే, లోకేష్ చంపేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్లకు చెబుతున్నానని, పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరించవద్దని చెప్పారు. దయచేసి పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, లేదంటే మాజీ సర్పంచ్లతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలపై ప్రేమ ఉంటే ఎన్నికలు పెట్టాలన్నారు.
జగన్ కాదేమో కానీ, జనసేన అలాగే చేసింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ సరైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించలేదేమో కాదనీ, జనసేన మాత్రం సరైన ప్రతిపక్షంగా వ్యవహరించిందని చంద్రబాబు గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు. పంచాయతీ వ్యవస్థ చాలా బలమైనదన్నారు. ఓటమి భయంతో ఎన్నికలు పెట్టడం లేదన్నారు. జన్మభూమి కమిటీలను దోపిడీ కమిటీలుగా చేశారన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని తాను చంద్రబాబును కోరానని చెప్పారు. సర్పంచ్ల బదులు ప్రత్యేక అధికారి అంటున్నారని, మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకని, లోకేష్ను తీసేసి అలాగే చేయాలన్నారు.
ఓ పోస్ట్మాన్ మనవడి, కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ
చంద్రబాబు పార్టీ పెట్టలేదని, కానీ ఓ పోస్ట్మ్యాన్ మనవడు, ఓ కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నా హజారేలా, అరవింద్ కేజ్రీవాల్ల వలె పెద్ద పెద్ద విలువల గురించి మాట్లాడనని చెప్పారు. 2014లో చంద్రబాబుకు గెలుస్తాననే నమ్మకం లేదని చెప్పారు. జగన్ సీఎం అయితే అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పారని తెలిపారు. దోపిడీ వ్యక్తులను ఎదుర్కొనే ధైర్యం పవన్కు, జగన్కు ఉందని చెప్పారు.
చంద్రబాబు, జగన్లకు హెచ్చరిక
జగన్ అంటే తనకు కోపం ఏమీ లేదని, ఆయన రూ.లక్ష కోట్లు తిన్నారో లేదో తనకు తెలియదని పవన్ అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలను గోదావరి జిల్లాలకు తీసుకు వస్తే తరిమి తన్నేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. గండ్ర గొడ్డళ్లు, కర్రలతో బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబుకు లేదా జగన్కు ఒకటే చెబుతున్నా.. మీరు ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చేస్తే నేను అలాగే చేస్తా, మీరు వ్యవస్థను అడ్డుపెట్టుకొని, ఫ్యాక్షన్ రాజకీయంతో ఎవరినైనా ఇబ్బంది పెడితే నేను ప్రజా ఉద్యమాన్ని నడిపించి మిమ్మల్ని గోదావరిలో కలిపేస్తానని హెచ్చరించారు.