మీరు జగన్తో కూడా కలుస్తారు, అప్పుడు చూపిస్తారు: చంద్రబాబుకు పవన్ వార్నింగ్
తుని: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమన్నారు.
ఆసక్తికరం: రాజాసింగ్ కార్యాలయానికి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్, ఎందుకంటే?
ఈ దాడిపై ప్రభుత్వం వెలికిగా మాట్లాడటం సరికాదన్నారు. దాడి ఘటనను లోతుగా విశ్లేషించాలని సూచించారు. జగన్ పైన తల్లి, చెల్లి దాడి చేయించారని చెప్పడం విడ్డూరమన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరగాలన్నారు. ఆయన తుని బహిరంగ సభలో మాట్లాడారు.
చంద్రబాబూ! 2019లో ప్రజలు ఆగ్రహం చూపిస్తారు
చంద్రబాబు నాయుడును తాము కోరింది మంచి పాలన మాత్రమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అంతిమ లక్ష్యం అధికారమని, జనసేన అంతిమ లక్ష్యం మార్పు అని చెప్పారు. ఏపీకి జాతీయ పార్టీలు అన్యాయం చేశాయని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందని చెప్పారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం పైన చాలా కోపంతో ఉన్నారని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ కోపాన్ని చూపిస్తారని జోస్యం చెప్పారు.
మీ పౌరుషం ఎటు పోయింది, నాకు పౌరుషం ఉంది
మీకు (ప్రజలకు) రూ.2వేలు కావాలా లేక 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అనుభవం ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇస్తే ఇప్పుడు ఆయన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఫోటోలు తీయించుకున్నారని ఆరోపించారు. మీ ఎంపీలను చావగొడితే మీ పౌరుషం ఎటు పోయిందని యనమల రామకృష్ణుడిని అడుగుతున్నానని అన్నారు. తాను సాధారణ పోస్ట్మెన్ మనవడినని, సాధారణ కానిస్టేబుల్ కొడుకునని, కానీ తెగింపు ఉందని చెప్పారు.
ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ కాకినాడలో ప్రత్యేక హోదా కోసం హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. తాను బీజేపీని విమర్శిస్తే బీజేపీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే, అదే కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వెనుకేసుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చంద్రబాబు మన ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టవలసిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు వంటి వ్యక్తి చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు ఉంచాలా అన్నారు.
మీకేం కావాలని చంద్రబాబు అడిగారు
తాను టీడీపీకి మద్దతిచ్చినప్పుడు మీకు ఏమైనా కావాలా అని చంద్రబాబు అడిగారని, అందుకు తాను మంచి పాలన కావాలని చెప్పానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డితోను పొత్తు పెట్టుకోవచ్చునని చెప్పారు. టీడీపీకి జనసేన అడ్డు అని భావిస్తే చంద్రబాబు వైసీపీతోను వెళ్తారని చెప్పారు. బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అని అంటారని, ఇవేం వ్యాఖ్యలన్నారు. కానీ మీలా తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టనని చెప్పారు. సర్పంచ్గా గెలవని నారా లోకేష్ను మంత్రిగా చేశారన్నారు.
అలాంటి దొంగలు తయారయ్యారు
రాష్ట్రంలో కొందరు దొంగ ఓట్లు ఎత్తుకెళ్లే దొంగలు తయారయ్యారని పవన్ అన్నారు. అధికారం అండతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించానని, కానీ చంద్రబాబు ఇప్పుడు కలిశారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పొత్తు అన్నారు. నా కోరిక కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, మార్పు కోసం, యువత కోసం, మీ కోసం వచ్చానని చెప్పారు.
తన స్థాయి దిగజారి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
చంద్ర మండలం పైకి వెళ్లి ఓ వ్యక్తి పాదం మోపినప్పుడు రాజకీయాలు ఎందుకు మార్చలేమని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని చెప్పారు. ఏం ఆశించకుండా, ప్రజా శ్రేయస్సు కోరే వారు పార్టీలోకి రావాలన్నారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను అభిమానించే వారు లక్షలాది మంది ఉన్నారని, తాను 2014లో అశోక్ గజపతి రాజు కోసం ప్రచారం చేశానని, కానీ ఆ తర్వాత తన గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.