పవన్ కళ్యాణ్ హెచ్చరికతో కాస్త తగ్గి!: టిడిపి రివర్స్ గేర్, జూపూడి ట్విస్ట్
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ ఆదివారం నాడు స్పందించింది. టిడిపి సీనియర్ నేత జూపూడి ప్రభాకర రావు స్పందించారు. నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన లాక్కుంటామని కాదని జూపూడి ట్విస్ట్ ఇచ్చారు.
జూపూడి మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవచ్చన్న పవన్ కళ్యాణ్ సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
రైతులతో చర్చకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన వారి భూములు లాక్కుంటామని కాదన్నారు. రైతులను ఒప్పించే తాము భూములను తీసుకుంటామని చెప్పారు.
పెనుమాక పర్యటించిన పవన్ కళ్యాణ్.. రైతుల భూములు బలవంతంగా తీసుకోవద్దని, వారిని ఒప్పించి తీసుకోవాలని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని తాను భావిస్తున్నాని, రాజధాని పైన కమిటీ వేసి అందులో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి వారి సలహాలు తీసుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే.
భూసేకరణపై వేచి చూసే ధోరణి!
భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఐదు గ్రామాలకు భూసేకరణ ముసాయిదా ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వం... మిగతా గ్రామాలకు ప్రకటనలు జారీ చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఓ పక్క రాజధాని గ్రామాల్లో గ్రామకంఠాల అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతుండటం, భూసేకరణకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడం, మిత్రపక్షం జనసేన అధినేత సహా విపక్షాలు మద్దతు పలుకుతున్ నేపథ్యంలో వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.