నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీబండారం రోడ్లపైకి తెస్తా, నా దురదృష్టం: జగన్కు పవన్ గట్టివార్నింగ్
అనంతపురం: తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్లరని తాను అడిగితే పవన్ కళ్యాణ్ అన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారని తిట్టడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జగన్ పైన బాగా సెటైర్లు వేశారు. జగన్కు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానని.. నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని, నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందని, నా పెళ్లిళ్ల వల్లే జగన్ను జైల్లోల కూర్చోబెట్టారని, ఇప్పటికీ కేసులో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏంటయ్యా.. మీరు మాట్లాడేది అని ఘాటుగా ప్రశ్నించారు.
తమాషా అనుకుంటున్నారా?
వైసీపీ నాయకులకు పిచ్చిపిచ్చిగా ఉందా, తమాషా అనుకుంటున్నారా అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాము అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి గురించి అని, ఆయన స్ఫూర్తిని అసెంబ్లీలోకి తీసుకు వెళ్లమని చెబుతున్నామని చెప్పారు. మాట్లాడేవాడు లేడంటే మీ ఇష్టానికి నోళ్లు పేలుతా ఉన్నాయని హెచ్చరించారు.
ముఠా సంస్కృతి పెట్టుకున్న మీకే అంత ఉంటే
కొద్దిమందితో ముఠా సంస్కృతి పెట్టుకున్న మీకే అంతగా ఉంటే, చే గువేరాను స్ఫూర్తిగా తీసుకున్న తనకు గుండెల్లో ఎంత ధైర్యం ఉండాలని పవన్ ప్రశ్నించారు. మీరు కూసే కూతలకు మేం భయపడతామా అన్నారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దన్నారు. మేం మాట్లాడుతోంది పాలసీల గురించి అన్నారు. అనంతపురం కరువు గురించి, ప్రత్యేక హోదా గురించి, అవినీతి గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే.. వైసీపీ నాయకుల బండారం రోడ్లపైకి తెస్తా
మీరు నన్ను వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకుల ఒక్కొక్కరి వ్యక్తిగత జీవిత చరిత్ర మొత్తం రోడ్ల మీద పెడతా జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఒక్కొక్కరు పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దన్నారు. ఏం తమాషాగా ఉందా అని ప్రశ్నించారు. మీ ఆడపడుచులను, మీ అక్కాచెల్లెళ్లను తిట్టడానికి మా సంస్కారం ఒప్పుకోదని చెప్పారు. పవన్ కళ్యాణ్ సంస్కారం అందుకు అంగీకరించదన్నారు.
నా దురదృష్టం
నా దురదృష్టం.. మా అమ్మ నన్ను అలా పెంచిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మొన్న జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగిన సమయంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ విజయమ్మ చేయించారని చెప్పారని, కానీ దాన్ని తాను ఖండించానని గుర్తు చేసారు. ఏ తల్లి అయినా కొడుకు మీద దాడి చేస్తుందా, టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారని వారిని తిట్టానని, అది తన సంస్కారమని చెప్పారు. మీ అమ్మను టీడీపీ నాయకులు తిడుతుంటే మేం విభేదిస్తామని, కానీ పాలసీలు వేరే అంశమన్నారు. పాలసీలపై నిలదీస్తామన్నారు.
విజయమ్మను తిడుతుంటే అండగా నిలబడ్డాం
తాము వ్యక్తిగతంగా కించపర్చమని పవన్ చెప్పారు. టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే మీ అమ్మకు మేం అండగా నిలబడ్డామని చెప్పారు. ఆమెను గౌరవించామని తెలిపారు. అంటే రేపు పొద్దున్న ప్రజలు మీకు ఓట్లు వేయకుంటే వారిని కూడా ఇలాగే తిడుతారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు, జగన్లపై విమర్శలు
పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ... రాయలసీమ నుండి అనేక మంది నాయకులు, ముఖ్యమంత్రులు వచ్చాని, చంద్రబాబుతో సహా ఎవరూ కూడా మన గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించలేకపోయారని చెప్పారు. అవినీతితో నిండిపోయిన టీడీపీ, వైసీపీలను తరిమేయాలన్నారు. రాజకీయంలో కొత్త మార్పు తీసుకు వద్దామని చెప్పారు. చంద్రబాబు, జగన్ రాయలసీమ బిడ్డలేనని వారు స్పిన్నింగ్ మిల్లు తెరిపించాలన్నారు.