విజయనగరం వచ్చి అంతు చూస్తా: బొత్సకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక, 10 ఏళ్ల సమయం ఇవ్వండి
Recommended Video
రైల్వేకోడూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. తన కడప జిల్లా రైల్వేకోడూరు బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యారాయణను ఆడపడుచులు తరిమి తరిమి కొట్టిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు.
మళ్ళీ వస్తాను విజయనగరం, మీ అంతు తేలుస్తానని బొత్సను హెచ్చరించారు. బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా తాము టీడీపీతో కలిసిపోయామని మాట్లాడుతున్నారని, బొత్సా గారు.. మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే విజయనగరం వచ్చి మీకు సమాధానం ఇస్తాను జాగ్రత్త అని హెచ్చరించారు.
తనకు పది సంవత్సరాల సమయం ఇస్తే, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లిపోవడం ఆగేలా చేస్తానని, మనగడ్డ పై ఉద్యోగాలు తెచ్చుకుందామని చెప్పారు. మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఇస్తే పరిపాలన వ్యవస్థను మార్చి మీ జీవితాలు మార్చుతానని, లేదంటే మీరు ఇచ్చిన బలానికి తగ్గట్టుగా బలంగా పోరాడతాను తప్ప అవకాశవాద రాజకీయాలు చేయనని చెప్పారు.
తన వెనుక ఉన్న బలం తనది కాదని, మార్పు కోరుకునే ప్రజలది అని, మీరు బలంగా అండగా ఉంటే మీ బిడ్డల భవిష్యత్ తీర్చిదిద్దుతానని చెప్పారు. నేను మ భవిష్యత్తు కోసం పని చేస్తున్నానని చెప్పారు. రాయల వారు ఏలిన సీమ ఇది, ఆ రోజుని మళ్ళీ జనసేనతో తీసుకొద్దామన్నారు. గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని, ఇది పారదర్శకతకు చిహ్నమని, ఈ గాజు గ్లాసులో లైట్ వేసి చూస్తే ధర్మ చక్రం ప్రతిబింబిస్తుందని, జనసేన తీసుకురాబోయే నీతివంతమైన రాజకీయాలకు ఈ గాజు గ్లాసు ప్రతి రూపం అన్నారు.