బాబూ! చేతులు కట్టుకుని కూర్చోం, రోడ్లపై ఎలా తిరుగుతారో చూస్తా: పవన్ వార్నింగ్
విజయనగరం: తెలుగుదేశం సర్కారం హయాంలో సాంప్రదాయ మత్స్యకారులకు న్యాయం జరగడం లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మత్స్యకారులంటే టీడీపీ, బీజేపీ నేతలే గుర్తొచ్చేలా చేశారని అన్నారు. శనివారం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా భోగాపురంలో తన పోరాట యాత్రను కొనసాగించారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తుఫాన్ల నుంచి రక్షణ కల్పించే చర్యలు కూడా చేపట్టడం లేదని అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇక్కడ ఫిష్షింగ్ జట్టీలను కూడా నిర్మించలేదని అన్నారు.
ఎమ్మెల్యేల అభివృద్ధే..
చంద్రబాబు ప్రభుత్వంలో ఎమ్మెల్యే అభివృద్ధి చెందుతున్నారని, ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉంటున్నారని పవన్ అన్నారు. 17వేల కి.మీల రోడ్లు నిర్మించామని బాబు చెప్పుకుంటున్నారని.. ఇక్కడ అసలు రోడ్లే లేవని అన్నారు. ఈ ప్రాంతంలో చెరువులు ద్వారా వ్యవసాయం ఎక్కువ అని అన్నారు. అభివృద్ధి ఏమోగానీ, చంద్రబాబు ప్రభుత్వం మంచినీళ్లు ఇస్తే చాలని ఇక్కడి ప్రజలు అంటున్నారని పవన్ చెప్పారు.
ప్రజలకు అండగా నిలబడరా?
పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలుస్తున్న ఈ ప్రభుత్వం.. సగటు యువతకు, మత్స్యకారులు, పేద ప్రజలకు అండగా నిలబడటం లేదని అన్నారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు చేపట్టిన ప్రాజెక్టుల్లో రైతులకు, నిర్వాసితులకు న్యాయం జరగ లేదని అన్నారు. తారకరామతీర్థ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. ఉద్యోగాల కోసం యువత రోడ్లపైకి వస్తే అన్యాయంగా అణచివేస్తున్నారని అన్నారు.
అవినీతి జరగలేదా?
చంద్రబాబు మాట్లాడితే తమ ప్రభుత్వంలో అవినీతి లేదంటున్నారని.. ఆయన వద్దకు జనసేన సైనికులను పంపిస్తానని.. ఇక్కడ ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో చూపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. 2050 వరకు గుప్పెడు ఇసుక కూడా లేకుండా ఇక్కడి టీడీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బాబూ.. రోడ్లపై ఎలా తిరుగుతారో చూస్తా?
ఉమ్మడి ఏపీలో బాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారని.. అద్భుత ప్రగతి సాధిస్తామని రెండు ముక్కలయ్యేలా చేశారని పవన్ విమర్శించారు. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుని పోయిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు. చంద్రబాబు ఇప్పుడేమో 2050 అంటున్నారని అన్నారు. తాను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు అంటున్నారని అన్నారు. ఇలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడితే రోడ్లపై ఎలా తిరుగుతారో చూస్తామంటూ పవన్ హెచ్చరించారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగానే.. చంద్రబాబు చేసిన రుణమాఫీలో మాఫీ లేదని ఎద్దేవా చేశారు.
బాబు పరివారమంతా అవినీతే..
ఉద్యోగావకాశాల కోసం మరోసారి కలింగాంధ్ర ఉద్యమం వచ్చేలా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం వలసలను ఆపలేకపోతోందని, కాలుష్యం వచ్చే పరిశ్రమలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్ తరహా అభివృద్ధి అంటే కుల రాజకీయాలు ఉండవని, అందరూ సమానులేననే భావన ఉంటుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని, దేశాధ్యక్షుడు తన స్నేహితుడు అవినీతికి పాల్పడినా జైల్లో పెట్టించారని చెప్పారు.
చంద్రబాబు దగ్గర అవినీతి శాసనసభ్యులే ఉన్నారని, వారందరి లిస్టు ఇస్తాననని పవన్ చెప్పారు. ఎన్ని వేల ఎకరాల భూములు కొన్నారో చెబుతానని అన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారని.. ఆ సొమ్మును ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పరివారమంతా అవినీతిమయమైందన్నారు.
చేతులు కట్టుకుని కూర్చోనంటూ బాబుకు హెచ్చరిక
చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాల భూములు తీసుకుంది గానీ.. ఉపాధి మాత్రం లభించలేదని అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టుకంటూ భూములు సేకరించారని, అవి కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. వందల ఎకరాలు టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్నాయని, ప్రజలకు మాత్రం నివాసాలు లేవని అన్నారు. ఇలాగే ప్రభుత్వ వైఖరి కొనసాగితే సహించబోమని అన్నారు. చంద్రబాబు దోపిడీ విధానాల వల్ల వేర్పాటు వాదం వస్తే చేతులు కట్టుకుని ఉండనని, అప్పుడు తానెంటో చూపిస్తానని పవన్ గట్టిగా హెచ్చరించారు. ఇప్పుడు మర్యాదగానే మాట్లాడుతున్నానని అన్నారు.
ఏపీలో బీజేపీ మూడు ముక్కలు
తనకు బీజేపీ నేతలు స్క్రిప్టు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వతంత్ర వ్యక్తిత్వం కలవాడినని అన్నారు. తాను చంద్రబాబులా 36సార్లు మాట మార్చనని అన్నారు. తనది ఒకటే మాట.. ఒకే బాణం అని అన్నారు. తాను తప్పు చేస్తే చెబుతానని, క్షమాపణ కోరతానని, శిక్ష కూడా అనుభవిస్తానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మూడు ముక్కలై ఉందని అన్నారు. రాయలసీమ బీజేపీ, టీడీపీ అనుకూల బీజేపీ, నేషనల్ బీజేపీ, వైసీపీకి అనుకూల బీజేపీ ఉన్నాయని అన్నారు. తనకు ఆ మూడు మక్కలతో సంబంధం లేదని పవన్ స్పష్టం చేశారు.