పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి అవకాశమే ఇచ్చేవారు కాదట.. సంచలన వ్యాఖ్యలు చేసిన రావెల
ఎన్నికలకు ముందు టిడిపి నుండి జనసేన పార్టీలో చేరి, ఎన్నికల తర్వాత అనూహ్యంగా తన పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన రావెల కిషోర్ బాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు పార్టీలో సరైన స్థానం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.జనసేన కీలక నేతలతో తాను ఒకడినని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదన్న రావెల..
అంతేకాదు కనీసం పవన్ కళ్యాణ్ తన అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాడన్నారు రావెల. తన సలహాలు సూచనలు ఎప్పుడు పవన్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న రావెల కిషోర్ బాబు ఆ తర్వాత గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, కనీసం ఫోన్ అయినా మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని పేర్కొని పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. పైకి సన్నిహితంగా అనిపించినా, ఆయన అంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కాదని, రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ఏ రోజు అవకాశం ఇవ్వలేదని రావెల పేర్కొన్నారు.
జనసేన ఓటమికి టీడీపీతో సంబంధం ఉందన్న భావనే కారణం అన్న రావెల కిషోర్ బాబు
ఇక టీడీపీ, జనసేన పార్టీ ల మధ్య సంబంధాలు ఉన్నాయన్న వాదనే జనసేన కొంప ముంచింద రావెల తెలిపారు. టిడిపి, జనసేన రెండు ఒకటే నన్న భావన గ్రామీణ స్థాయి వరకు ప్రచారం జరిగిందని ఆ ప్రచారాన్ని నమ్మి ప్రజలు జనసేన కు ఓటేస్తే టిడిపికి వేసినట్టు అవుతుందని భావించి జనసేన ను ఓటమి పాలు చేశారని రావెల వ్యాఖ్యానించారు.
అవినీతి టీడీపీకి పట్టం కట్టాలని వస్తుందని భావించిన ప్రజలు అటు టిడిపికి గుణపాఠం చెప్పడంతో పాటు, టీడీపీకి సహకారం అందిస్తున్న భావనతో జనసేనను సైతం ఓటమి పాలు చేశారని రావెల తెలిపారు.ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు అని, కనీసం ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అని, తాను అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని రావెల చేసిన వ్యాఖ్యలు అటు జనసైనికులలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పైనే సంచలన ఆరోపణలు చేసిన రావెల.. జనసైన్యం స్పందన ఏంటో ?
గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కూడా రావెల కిషోర్ బాబుకు స్థానిక టిడిపి నాయకులతో పొసగని పరిస్థితి. ఇక టిడిపి నుండి రావెల కిషోర్ బాబు వెళ్లిపోయిన తర్వాత టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రావెల కిషోర్ బాబు పార్టీ నుండి బయటకు వెళ్లడంతో పార్టీ కి పట్టిన పీడ వదిలిందని ప్రకటించారు. ఆ తర్వాత జనసేనలో చేరిన రావెల ఇప్పుడు ఏకంగా జనసేనాని పైనే సంచలన ఆరోపణలు చేసి పార్టీని వీడి బీజేపీలో చేరారు. మరి రావెల వ్యాఖ్యలపై, పార్టీ మార్పుపై జనసైనికులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.