పవన్ కల్యాణ్ కొత్త డిమాండ్: తిరుమల పింక్ డైమండ్, రాయలవారి నగలపైనా: ఛలో అంతర్వేదిపై
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లు కాలిపోయిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించే దిశగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది. శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు వెల్లడించింది.
తొలి అడుగు మాత్రమే..
ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ సాయంత్రం నిర్వహించ తలపెట్టిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతర్వేది ఉదంతంపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం దీనికి సానుకూలంగా వెలువడటం శుభ పరిణామమని అన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించటంతోనే సమస్య పరిష్కారం అయినట్టు తాము భావించట్లేదని అన్నారు.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అంటే..
నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందీ అంటే.. అంతర్వేది ఘటన ప్రమాదం కాదనే విషయాన్ని అంగీకరించినట్టయిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మున్ముందు చోటు చేసుకోకుండా ఉండటానికి ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హైందవ ధర్మాన్ని, హిందూయిజాన్ని, సనాతన ధర్మాన్ని ఇక ముందు కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ బాధ్యతను తాము నిర్వర్తిస్తామనీ చెప్పారు.
ఆలయ మాన్యాల అన్యాక్రాంతంపైనా
అంతర్వేది ఘటనపై మాత్రమే కాకుండా ఇంకా పలు అంశాల మీద సీబీఐ దర్యాప్తును చేపట్టాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన మాన్యాలు అన్యక్రాంతం అయ్యాయని, వాటిపైనా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల దేవాదాయ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని, వాటి మాటేమిటని ప్రశ్నించారు. సీబీఐ ద్వారా విచారణ జరిపించి దేవాదాయ ఆస్తులకు రక్షణ కల్పించాలని అన్నారు.
Recommended Video
పింక్ డైమండ్, రాయలవారి నగల మాయంపైనా..
తిరుమలలో శ్రీవారి పింక్ డైమండ్ మాయం కావడంపైనా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పింక్ డైమండ్ మాయం కావడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు రమణ దీక్షితులు పలుమార్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆయన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని అన్నారు. పింక్ డైమండ్ ఎటుపోయిందో ఆరా తీయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాలు మాయం కావడంపైనా దర్యాప్తు జరిపించాలని అన్నారు.